- ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే పీడి యాక్ట్ నమోదు చేయ్యాలి
- 7వ వార్డ్ అక్రమ పనులను అడ్డుకుంటాం
- 130 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అని నిరూపిస్తాం!
- మీ పట్టా భూమి అని నిరూపించుకోండి
- బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇర్షాద్ బహిరంగ సవాల్..
- అక్రమ నిర్మాణాలపై కమిషనర్కు ఫిర్యాదు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని 130 సర్వే నెంబర్ భూమి వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని, దీనిని కాపాడేందుకు తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తాండూరు మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ స్పష్టం చేశారు. శుక్రవారం అబ్దుల్ అహద్ ఈ స్థలం పై చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ కౌన్సిలర్ లు ఖండించారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ, గత కొంతకాలంగా ఈ సర్వే నెంబర్ చుట్టూ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇర్షాద్ మాట్లాడుతూ.. “అబ్దుల్ అహద్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. వాస్తవాలను దాచిపెట్టి, 130 సర్వే నెంబర్ను తన సొంత ఆస్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం” అని విమర్శించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ఉద్దేశంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఈ సందర్భంగా ఇర్షాద్ ఒక బహిరంగ సవాల్ విసిరారు. “130 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అని నిరూపించడానికి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. మేము దానిని ప్రభుత్వ భూమిగానే నిరూపిస్తాం. ఒకవేళ అది మీ సొంత పట్టా భూమి అయితే, దానికి సంబంధించిన అధికారిక పత్రాలను బయటపెట్టి, అది మీ భూమి అని నిరూపించుకోవాలి” అని డిమాండ్ చేశారు. నిరూపించలేనప్పుడు అక్రమంగా భూమిలోకి ప్రవేశించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారని ఇర్షాద్ ఆరోపించారు. అధికారుల కళ్ళు గప్పి, రాత్రికి రాత్రే కట్టడాలు నిర్మిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ యంత్రాంగంపై ఉందని, కానీ క్షేత్రస్థాయిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వార్డ్ లో ఎలాంటి అక్రమాలు జరిగిన సహించేది లేదన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చెయ్యాలన్నారు. అనంతరం ఇర్షాద్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 130 సర్వే నెంబర్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే అడ్డుకోవాలని, అక్కడ జరుగుతున్న పనులపై విచారణ జరిపి స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ వివాదంపై అధికారులు సత్వరమే స్పందించకపోతే, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఇర్షాద్ హెచ్చరించారు.




