- పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ యువ నాయకుడు సందీప్ రెడ్డి శుభాకాంక్షలు
- పరీక్షలంటే భయం వద్దు.. ఆత్మవిశ్వాసంతో రాయండి
- తాండూరు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించాలి
- తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తగ్గించాలి: సందీప్ రెడ్డి పిలుపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : రేపటి నుండి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సందీప్ రెడ్డి విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని కోరారు.ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. పదో తరగతి అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. పదేళ్ల మీ విద్యా ప్రయాణానికి ఇది ఒక బలమైన పునాది. పరీక్షలను ఒక సవాల్గా కాకుండా, మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా భావించాలి. ప్రశ్నపత్రాన్ని చూసి కంగారు పడకుండా, తెలిసిన సమాధానాలను ముందుగా రాస్తూ ఆత్మవిశ్వాసంతో పరీక్షను పూర్తి చేయాలి” అని సూచించారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టుదలతో చదివి, తాండూరు నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో పిల్లలపై మార్కుల ఒత్తిడి పెంచకుండా, వారికి అవసరమైన మానసిక ధైర్యాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకుని నిబంధనలు పాటించాలన్నారు. హాల్ టికెట్లు, అవసరమైన స్టేషనరీని ముందే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తగినంత నిద్ర పోవాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి పదికి పది జీపీఏ సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సందీప్ రెడ్డి మనస్ఫూర్తిగా కోరుకున్నారు.






