- పెట్టుబడిదారీ పాలకులకు ‘జెన్-జీ’ వణుకు
- ఎస్.ఎఫ్.ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజుకుమార్ గౌడ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ ప్రభుత్వాల పునాదులను ‘జెన్-జీ’ యువత కదిలిస్తోందని ఎస్.ఎఫ్.ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజుకుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. 1995-2005 మధ్య జన్మించిన ఈ తరం యువత, దేశ సంపదను కొద్దిమంది ధనవంతులకు దోచిపెట్టే పాలకుల పాలిట సింహస్వప్నంగా మారిందని పేర్కొన్నారు.శ్రీలంక, బంగ్లాదేశ్ పరిణామాలను ఉదహరిస్తూ.. అవినీతి పరులైన పాలకులను గద్దె దించడంలో జెన్-జీ యువత చూపిన చొరవ అసాధారణమని కొనియాడారు. జపాన్ ఎన్నికల్లో సైతం పాత రాజకీయ పార్టీలను కాదని, ఒక యువ గాయకుడిని ప్రధానమంత్రిగా గెలిపించుకోవడం ద్వారా యువత తమ సత్తా చాటిందని గుర్తుచేశారు. దేశ వనరులపై అందరికీ సమాన హక్కు ఉండాలన్నారు. ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం, ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని,కులమతాలకు అతీతంగా సమానత్వ సమాజం ఏర్పడాలన్నారు. భారతదేశంలో కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, ఒకవైపు పేదరికం.. మరోవైపు ఆకాశాన్నంటే ధనవంతుల భవనాలు ఉండటంపై యువత ఆలోచించాలని కోరారు. భగత్ సింగ్ స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం జెన్-జీ యువత గొంతుక ఎత్తాలని రాజుకుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.






