గత పాలకుల భయం వీడింది.. స్వేచ్ఛగా సమస్యల చర్చ..!

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశం దిగ్విజయం
  •  చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి...! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం అత్యంత సౌహార్దపూర్వక వాతావరణంలో, విజయవంతంగా ముగిసిందని మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి వెల్లడించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.గత ఐదేళ్ల కాలంలో కౌన్సిల్ సమావేశం అంటేనే భయాందోళనలకు గురయ్యే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే చొరవతో కౌన్సిలర్లందరూ తమ వార్డు సమస్యలను స్వేచ్ఛగా వివరించే అవకాశం లభించిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధి కోసం సమ్మర్ యాక్షన్ ప్లాన్, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, స్క్రాప్ నిర్వహణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. పట్టణంలోని 36 వార్డుల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు హామీ ఇచ్చారు. దోమల నివారణకు ప్రతి వార్డులో ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయిస్తున్నామని.. డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రోడ్లపై తోపుడు బండ్లు, కూరగాయల విక్రేతలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కేటాయించిన స్థలాల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో 2014-16 మధ్య కాలంలో అమలు చేసిన విధంగానే, డంపింగ్ యార్డ్‌లో తడి-పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీని పునఃప్రారంభిస్తామని తెలిపారు. తాండూరు పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు సహకరించాలని చైర్‌పర్సన్ కోరారు. ముఖ్యంగా పట్టణ అభివృద్ధి పనుల కోసం సకాలంలో మున్సిపల్ పన్నులు చెల్లించి తమ బాధ్యతను చాటుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *