- తాండూరు పురపాలకలో ‘99 రోజుల ప్రగతి ప్రణాళిక’కు శ్రీకారం
- పట్టణ సమస్యల పరిష్కారమే లక్ష్యం: చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి
- మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి కార్యక్రమం ప్రారంభం
జానవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా తాండూరు మున్సిపాలిటీలో నూతన అధ్యాయం మొదలైంది. శనివారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ పట్లోళ్ళ నీరజ బాల్రెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్దుల్ రజాక్, మరియు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డితో కలిసి 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ఈ 99 రోజుల ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో చెత్త సేకరణ, డ్రైనేజీల నిర్వహణ పక్కాగా జరగాలి.పెండింగ్లో ఉన్న రోడ్లు, ఇతర నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలి.మున్సిపల్ ఆదాయ మార్గాలను మెరుగుపరుస్తూనే, ప్రజల నుంచి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విభాగం అధికారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, వార్డు ఆఫీసర్లు మరియు శానిటరీ జవాన్లు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. 99 రోజుల వ్యవధిలో తాండూరు పట్టణ రూపురేఖలు మార్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డి.ఇ. మణిపాల్, టౌన్ ప్లానింగ్ అధికారులు, వార్డు ఆఫీసర్స్, శానిటరీ జవాన్లు మరియు వివిధ విభాగాల సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.



