- రూ. 1.34 కోట్లతో అన్ని వార్డుల్లో హైమాక్స్ లైట్లు
- 8వ వార్డులో రూ. 25 లక్షలతో రోడ్డు పనులకు సైతం శ్రీకారం
- మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజా బాల్రెడ్డి వెల్లడి
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజా బాల్రెడ్డి తెలిపారు. 3వ వార్డు ఇందిరానగర్ రామమందిరం ప్రాంతంలో నూతనంగా అమర్చిన హైమాక్స్ విద్యుత్ దీపాలను వైస్ ఛైర్మన్ రజాక్, స్థానిక కౌన్సిలర్ సుల్తానా సమీర్, టౌన్ ప్రెసిడెంట్ నాగుతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ వార్డుల్లో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు.
ఎస్డిఎఫ్ నిధుల నుంచి రూ. 1.34 కోట్లు కేటాయించి, పట్టణంలోని ప్రతి వార్డుకు రెండు చొప్పున హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
గతంలో లైట్లు వేసి నిర్వహణ పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితులు ఉన్నాయని, ఈసారి రెండేళ్ల వారంటీ ఉన్నందున ఆ కాలపరిమితి ముగిసే వరకు లైట్ల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టరే చూసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.
అదేవిదంగా 8వ వార్డులో రూ. 25 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని చెప్పారు. అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్స్ రూ. 5 లక్షలు ద్వారా 16, 18 వార్డులలో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా ప్రారంభించినట్లు వివరించారు.
పట్టణంలోని 36 వార్డులు తమకు సమానమేనని, ఏ ఒక్క వార్డునూ నిర్లక్ష్యం చేయకుండా విడతల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, విద్యా వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్న ఎమ్మెల్యేకు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పట్టణ నాయకులు మరియు స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు.

