- ఆక్రమణల తొలగింపుతో ఊపిరి పీల్చుకున్న పౌరులు
- రోడ్లన్నీ విశాలం
- అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు; పట్టణంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు మున్సిపల్ యంత్రాంగం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను అధికారులు శుక్రవారం తొలగించారు.
రోడ్లపై ఆక్రమణల వల్ల రోజూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ముఖ్యంగా పాత మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో నడవడానికి కూడా స్థలం లేక కాలినడకన వెళ్లేవారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పట్టణవాసులు చాలాకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనే పలుమార్లు వ్యాపారులకు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని మున్సిపల్ సిబ్బంది నోటీసులు, సూచనలు ఇచ్చినప్పటికీ మార్పు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పట్టణంలో రోడ్లు వెడల్పుగా ఉంటేనే అందరికీ రవాణా సౌకర్యవంతంగా ఉంటుందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే ఈ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు
తొలగింపు సమయంలో కొందరు వ్యాపారులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చట్టబద్ధంగా, శాంతియుతంగా ప్రక్రియ పూర్తియ్యేలా చూశారు.సమస్యల పరిష్కారానికి చిరు వ్యాపారులకు ప్రత్యేకంగా ‘వెండింగ్ జోన్లు’ కేటాయించి, అటు వ్యాపారుల ఉపాధికి భంగం కలగకుండా, ఇటు పట్టణ రవాణా సజావుగా సాగేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
