- తాండూరు మున్సిపల్ అధికారుల తీరుపై చిరు వ్యాపారుల ఆగ్రహం
- ఉన్నఫలంగా ఎక్కడికి పోవాలంటీ వ్యాపారుల నిరసన
- చిరువ్యాపారులపై దౌర్జన్యం ఏంటని ప్రజాప్రతినిధుల నిలధిత
జనవాహిని ప్రతినిధి తాండూరు; రోడ్లపై ఆక్రమణల పేరుతో మున్సిపల్ అధికారులు తమ పొట్ట కొడుతున్నారని తాండూరు పట్టణంలోని చిరు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న చిన్న తరహా వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ సిబ్బంది ఉన్నపళంగా తొలగించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తమ ఉపాధిని దెబ్బతీసేలా మున్సిపల్ యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వ్యాపారులు ఆరోపించారు. ఇదే రోడ్డు మార్గంలో ఎన్నో పెద్ద పెద్ద ఆక్రమణలు, శాశ్వత నిర్మాణాలు కంటికి కనిపిస్తున్నప్పటికీ, అధికారులు వాటి జోలికి వెళ్లకుండా కేవలం తమ లాంటి రెక్కాడితే గాని డొక్కాడని చిరు వ్యాపారులపైనే ప్రతాపం చూపడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు.
బాధిత వ్యాపారులకు మద్దతుగా ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అధికారుల చర్యలను నిరసిస్తూ వ్యాపారులు ఆందోళనకు దిగడంతో విషయం తీవ్ర రూపం దాల్చింది. దీంతో పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మున్సిపల్ అధికారులు, వ్యాపారులు మరియు ప్రజాప్రతినిధుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనకుండా చర్యలు చేపట్టారు.
ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపకుండా, జీవనోపాధిగా ఉన్న దుకాణాలను తొలగిస్తే తమ కుటుంబాలు వీధిన పడతాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని చిరు వ్యాపారులు కన్నీటిపర్యంతమయ్యారు.
