- నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ డిమాండ్
- అన్ని ఆధారాలతో పిర్యాదు
జనవాహిని ప్రతినిధి తాండూరు; అర్హత లేకున్నా వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్లను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ డిమాండ్ చేశారు. తాండూరు పట్టణంలో ఇటీవల ఒక నకిలీ డాక్టర్ వ్యవహారం వెలుగులోకి రావడం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన స్పందించారు.
గత రెండు నెలల క్రితమే నకిలీ వైద్యుల ముఠాలపై తాను ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేశానని, ఆ ఫిర్యాదు ఆధారంగానే ప్రస్తుత నకిలీ డాక్టర్ భాగోతం బయటపడిందని ఆయన తెలిపారు. కనీసం పదో తరగతి కూడా పూర్తి చేయని వ్యక్తులు, ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా వైద్యుల అవతారమెత్తి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఈ నకిలీ డాక్టర్ ఇచ్చిన వికటించిన ఇంజెక్షన్ల వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
తాండూరు ప్రాంతంలో ఇప్పటికీ పలువురు నకిలీ వైద్యులు చలామణి అవుతున్నారని, వారిలో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వీరు కేవలం అసంపూర్తి వైద్యమే కాకుండా, చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడపిల్లలను కడుపులోనే తుంచేసే అక్రమాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై త్వరలోనే పూర్తి ఆధారాలతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని తాండూరులోని నకిలీ డాక్టర్లందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నకిలీ వైద్యుడిని వెంటనే రిమాండ్కు పంపించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.