ఇక ఐఐటీల్లోనూ ఎంబీబీఎస్, ఎండీ కోర్సులు..! తొలిసారి అక్కడే..!
మన దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న ఐఐటీలు ఇంతకాలం ఇంజనీరింగ్ తో పాటు పలు సాంకేతిక విద్యకు సంబంధించిన కోర్సుల్ని ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. వీటిలో ప్రవేశాల కోసం జాతీయ స్ధాయిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) నిర్వహిస్తున్నారు. అలాగే మెడికల్ కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ ల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. నీట్ ర్యాంకుల ఆధారంగా ఎయిమ్స్ తో పాటు పలు వైద్య విద్య సంస్థలు, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఐఐటీల్లోనే ఎంబీబీఎస్, ఎండీ కోర్సులు చేసే రోజులు వచ్చేశాయి.
ఐఐటీల్లో తొలిసారి ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్డీ కోర్సులు అందించేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్ (IIT Madras) ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 70 ఏళ్లుగా ఐఐటి ఇంజనీరింగ్ కు పర్యాయపదంగా నిలిచిన మద్రాస్ ఐఐటీ.. ఇప్పుడు వైద్య విద్యలో కోర్సుల్ని ఆఫర్ చేసేందుకు వీలుగా ఏకంగా మెడికల్ స్కూల్ నే ప్రారంభిస్తోంది. ఇండియా టుడేకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి ఈ విషయం వెల్లడించారు. త్వరలోనే సొంతంగా ఒక వైద్య శాస్త్రాల విభాగాన్ని ప్రారంభించి, వైద్య డిగ్రీలను ప్రదానం చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వైద్యశాస్త్రంలో తాము ఇవ్వబోయే డిగ్రీలు అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎండీ, డాక్టోరల్ పీహెచ్డీ వంటివి ఉన్నట్లు కామకోటి తెలిపారు. 2023లోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్య శాస్త్రాల కోర్సుల్లో సాంకేతిక విభాగాన్ని ఐఐటీ మద్రాస్ ప్రారంభించింది. ఇది నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అందిస్తోంది. ఓ హైబ్రిడ్ గ్రాడ్యుయేట్కు శిక్షణ ఇస్తుంది. వీరు కొంత ఇంజనీర్, కొంత జీవశాస్త్రవేత్త. రోగులకు చికిత్స చేయడానికి కాకుండా, స్కానర్లు, ఇంప్లాంట్లు, సాఫ్ట్వేర్లను రూపొందించడానికి వీళ్లను తయారు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వైద్యుల్ని కూడా తయారు చేసేందుకు సిద్దమైంది.

