SBI బిగ్ నోటిఫికేషన్: ఒకేసారి ఏకంగా 9,124 పోస్టులు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు భారీ అవకాశాన్ని కల్పించింది. ఇటీవల 1,538 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్బీఐ, తాజాగా దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ‘జూనియర్ అసోసియేట్స్ – కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్’ విభాగంలో 9,124 ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ను వెలువరించింది. ఈ ఖాళీలలో హైదరాబాద్ సర్కిల్ పరిధిలోనే 260 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు – దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి ఆగస్టు 31 వరకు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు & వయోపరిమితి:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే, అయితే వారు డిసెంబర్ 31 నాటికి సంబంధిత ఉత్తీర్ణత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
వయస్సు విషయానికి వస్తే.. ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం & దరఖాస్తు రుసుము:
- ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను మొత్తం మూడు దశల ద్వారా ఎంపిక చేస్తారు. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో మెయిన్స్ పరీక్ష, మూడో దశలో లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
- పరీక్షల నిర్వహణ: ప్రిలిమ్స్ పరీక్షను సెప్టెంబర్లో, మెయిన్స్ పరీక్షను నవంబర్లో నిర్వహించే అవకాశం ఉంది.
- ఫీజు వివరాలు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రుసుమును ఆన్లైన్ విధానంలోనే చెల్లించాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అభ్యర్థుల సౌకర్యార్థం పలు ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాయవచ్చు.


