- బిసి స్మశాన వాటికను శుభ్రం చేయించండి
- మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమీషనర్ కు 11వ వార్డు ముత్యాల గల్లీ ప్రజల వినతి
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూర్ పట్టణంలోని 11వ వార్డు ముత్యాల గల్లీకి చెందిన పోలీస్ స్టేషన్ వెనుక భాగం లోని బిసి స్మశాన వాటిక లో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో తీవ్ర అపరిశుభ్రంగా మారిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. స్మశాన వాటిక పరిసరాలను తక్షణమే శుభ్రం చేయించాలని కోరుతూ శుక్రవారం ముత్యాల గల్లీ నివాసులు మున్సిపల్ ఛైర్పర్సన్, మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డులో ఎవరైనా హఠాన్మరణం చెందితే అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశాన వాటికలోకి వెళ్లే పరిస్థితి కూడా లేదని వాపోయారు. స్మశాన వాటికలో చెట్లు, ముళ్ల పొదలు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు తీవ్ర అపరిశుభ్రత నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి స్మశాన వాటికను శుభ్రపరచి, సౌకర్యాలు కల్పించాలని ముత్యాల గల్లీ ప్రజలు కోరారు.