- ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీల తొలగింపు
- జనవాహిని’ కథనానికి తక్షణ స్పందన.. హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులు
జనవాహిని ప్రతినిధి, తాండూరు: తాండూరు పట్టణ కేంద్రంలోని ఇందిరా చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని రాజకీయ, ప్రైవేట్ ఫ్లెక్సీలతో కప్పేసిన వ్యవహారంపై ‘జనవాహిని’ ప్రచురించిన కథనం తీవ్ర ప్రభావం చూపింది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ‘ఫ్లెక్సీ’ల గ్రహణం..!” శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక వార్తా కథనానికి మున్సిపల్ అధికారులు, స్థానిక యంత్రాంగం తక్షణమే స్పందించింది.వార్త ప్రచురితమైన కొన్ని గంటల్లోనే మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పురపాలక సిబ్బంది, ఇందిరా చౌరస్తాలోని జయశంకర్ విగ్రహం చుట్టూ ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను యుద్ధప్రాతిపదికన తొలగించారు. మహనీయుడి విగ్రహానికి తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చారు.సొంత ప్రచార ఆర్భాటాల కోసం తెలంగాణ జాతి గర్వించదగ్గ మహనీయుడి విగ్రహాన్ని చాటున పెట్టడంపై ఉద్యమకారులు, ప్రజాసంఘాల నుంచి వ్యక్తమైన తీవ్ర ఆగ్రహాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని ‘జనవాహిని’ ఎండగట్టింది. కేవలం ఫ్లెక్సీలు తొలగించి చేతులు దులుపుకుంటే సరిపోదని, భవిష్యత్తులో తాండూరు పట్టణంలోని ఏ మహనీయుడి విగ్రహాల పరిసరాల్లోనూ ఇలాంటి ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా మున్సిపల్ అధికారులు కఠినమైన ఆంక్షలు విధించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





