- తాండూరు ఆస్పత్రి సూపరింటెండెంట్పై ఎమ్మెల్యే వేటు!
- సిబ్బంది వేధింపులపై బుయ్యని మనోహర్ రెడ్డి సీరియస్
- అరాచకం సాగితే సస్పెండ్ చేయిస్తా: ఎమ్మెల్యే ఘాటు హెచ్చరిక
- తిరిగి పాత సూపరింటెండెంట్ ‘మూర్తి’ నియామకానికి ఆదేశం
- రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొంతకాలంగా సాగుతున్న సూపరింటెండెంట్ అరాచక పర్వానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చెక్ పెట్టారు. సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన ఎమ్మెల్యే, ప్రస్తుత మెడికల్ సూపరింటెండెంట్ను బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో గతంలో పనిచేసిన మూర్తిని తిరిగి నియమించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ తన అనుచరులుగా ఉన్న కొందరిని చేరదీసి, మిగిలిన సిబ్బందిని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారనే శీర్షిక జనవాహిని లో రావడం తో స్పందించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా ఆసుపత్రి మరియు మాతా శిశు సంరక్షణ కేంద్రం సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది తమ ఆవేదనను వెళ్లగక్కారు. మాపై కక్షగట్టి వేధిస్తున్నారు.. చెబితే ఏం చేస్తారో అన్న భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాం అంటూ ఎమ్మెల్యే ముందు వాపోయారు.సిబ్బంది చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, సూపరింటెండెంట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు సేవ చేయాల్సింది పోయి, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. పద్ధతి మార్చుకోకపోతే సస్పెండ్ చేయిస్తా అని అధికారులను హెచ్చరించారు. తిరిగి మూర్తిని సూపరింటెండెంట్గా నియమించాలని నిర్ణయించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ను బదిలీ చేసి, మూర్తిని నియమిస్తూ మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై ఆసుపత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.




