- చిరు వ్యాపారులకు అండగా ఉంటాం: బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
- ఆర్టీసీ డీఎంతో చర్చలు..
- ప్రాంగణంలోనే దుకాణాల నిర్మాణంపై విజ్ఞప్తి
- తొలగించిన డబ్బాల స్థానంలో శాశ్వత షాపుల ఏర్పాటుకు చొరవ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డబ్బాలను కోల్పోయి రోడ్డున పడ్డ చిరు వ్యాపారులకు తాము అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం ఆయన తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.గత రెండు రోజులుగా మున్సిపల్ అధికారులు బస్టాండ్ పరిసరాల్లో జేసీబీలతో డబ్బాలను తొలగించడంతో, ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి బాధితులతో మాట్లాడి, అనంతరం డీఎంతో చర్చలు జరిపారు. ఆర్టీసీ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో నూతనంగా దుకాణాలను నిర్మించి, వాటిని డబ్బాలు కోల్పోయిన వ్యాపారులకు కేటాయించేలా చొరవ చూపాలని కోరారు. ఇందుకు గల సాంకేతిక మరియు పరిపాలనాపరమైన అవకాశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. దశాబ్దాలుగా ఇక్కడే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న పేద వ్యాపారులకు అన్యాయం జరగనివ్వమన్నారు. ఆర్టీసీ అధికారుల సహకారంతో వారికి శాశ్వత దుకాణాలు నిర్మించి, ఉపాధి కల్పించేలా కృషి చేస్తాం” అని తెలిపారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పర్యాద రామకృష్ణ, ఎబీనేజర్ తో పాటు పెద్ద సంఖ్యలో బాధితులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.




