- గ్రామీణ క్రికెట్ రారాజుల కోసం ‘టీసీఏ’ సూపర్ లీగ్
- ఏప్రిల్ 20 నుంచి వరంగల్లో టీ20 సమరం
- బరిలో ఆరు జట్లు.. రంగారెడ్డి రేంజర్స్ కోచ్గా జగన్నాథ్ రెడ్డి
- వికారాబాద్ నుంచి ఐదుగురు క్రికెటర్ల ఎంపిక
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో దాగున్న క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరో భారీ టోర్నీకి సిద్ధమైంది. ‘ఆల్ స్టార్స్ టీ20 సూపర్ లీగ్’ పేరుతో ఈ నెల 20వ తేదీ నుంచి వరంగల్ వేదికగా ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో తలపడే ఆరు జట్లను టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి అధికారికంగా ప్రకటించారు.గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన తెలంగాణ గోల్డ్ కప్ అంతర జిల్లాల లీగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఈ సూపర్ లీగ్ కోసం ఎంపిక చేశారు. లీగ్ మ్యాచ్లు ఏప్రిల్ 20 నుండి 27 వరకు జరగనున్నాయి. ఫైనల్ పోరు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.రంగారెడ్డి రేంజర్స్ జట్టుకు కోచ్గా నియమితులైన జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో యువతకు క్రికెట్ పట్ల ఎంతో మక్కువ, ప్రతిభ ఉందని, వారికి టీసీఏ ఒక గొప్ప వేదికను కల్పిస్తోందని కొనియాడారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిని గాలికొదిలేసినా, టీసీఏ మాత్రం ఏటా టోర్నీలు నిర్వహిస్తూ క్రీడాకారులకు ప్రాణం పోస్తోందని ఆయన విమర్శించారు.రంగారెడ్డి రేంజర్స్ జట్టుకు వికారాబాద్ జిల్లా నుంచి ఐదుగురు క్రీడాకారులు ఎంపికై తమ సత్తా చాటారు. ఎంపికైన వారిలో ప్రవీణ్ కుమార్, కళ్యాణ్ పవర్, శివ శంకర్, బి. శివ, ఎండీ. సొహైల్ ఉన్నారు. ఈ టోర్నీ ద్వారా మరికొంత మంది యువ క్రికెటర్లు జాతీయ స్థాయికి ఎదగాలని కోచ్లు జగన్నాథ్ రెడ్డి, సతీష్ ఆకాంక్షించారు.




