AP Engineering Fees: ఏపీలో ఇంజనీరింగ్ ఫీజు ఖరారు..! అవన్నీ తాత్కాలికమే..!
ఏపీలో ప్రైవేటు, ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్ధుల నుంచి వసూలు చేయాల్సిన ఫీజుల్ని (Engineering Fees) ప్రభుత్వం ఖరారు చేసింది. బీటెక్, బీఈ కోర్సులకు 2026-27 విద్యా సంవత్సరం కోసం కట్టాల్సిన ఫీజుల్ని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్కో విద్యార్ది నుంచి వసూలు చేయాల్సిన కనీస వార్షిక ఫీజును రూ.47 వేలుగా నిర్ణయించారు. అంతకంటే ఎక్కువగా కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
రాష్ట్రంలో ఇప్పటివరకూ ఇంజనీరింగ్ కోర్సులకు కనీస వార్షిక ఫీజు రూ.40 వేలు మాత్రమే ఉంది. ఇప్పుడు దాన్ని రూ.47 వేలకు సవరించారు. అలాగే కొన్ని కాలేజీలు అంతకంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో.. అవన్నీ తాత్కాలికమే అని ప్రభుత్వం తేల్చేసింది. అలాగే ప్రస్తుతం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ లో చూపిస్తున్న ఫీజులు కూడా తాత్కాలికమే అని ప్రభుత్వం వెల్లడించింది. ఎందుకంటే ప్రస్తుత విద్యా సంవత్సరానికి తాత్కాలిక ఫీజుల్ని మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వం అనుమతించిన మేర కాలేజీలు విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని, అంతకు మించి మాత్రం అదనంగా వసూలు చేయకూడదని ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే లోపు ఉన్నత విద్యా ఫీజుల కమిటీ తుది ఫీజుల్ని ఖరారు చేస్తుంది. వాటిని వచ్చే ఏడాది నుంచి వసూలు చేసుకునేందుకు కాలేజీలకు అనుమతి ఇస్తారు. అప్పుడు ప్రస్తుతం ఇచ్చిన ఫీజు కంటే పెరిగితే విద్యార్ధుల నుంచి కాలేజీలు వసూలు చేసుకోవచ్చు. ముందే ఎక్కువగా వసూలు చేసి ఉంటే మాత్రం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. లేదా తర్వాతి సంవత్సరం ఫీజుల్లో సర్దుబాటు చేయాలి. అలాగే ఉన్నత విద్య ఫీజుల కమిటీ నిర్ధారించే ఫీజులకు అనుగుణంగానే తాము ఫీజులు వసూలు చేస్తామని కాలేజీలు అఫిలియేటెడ్ యూనివర్శిటీలకు హామీ ఇవ్వాలి.

