- ప్రజలను కష్టాల పాలు చేస్తున్న అధికారులు
- తాండూరులో ఏ వార్డులో ఎంత జరిగిందో బహిరంగ ప్రకటన చేయాలి
- కలెక్టర్, సబ్ కలెక్టర్కు బిఆర్ఎస్ నాయకులు పటేల్ కరుణాకర్ విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు: ఈనెల 14వ తేదీని ఓటర్ మ్యాపింగ్ చివరి తేదీగా ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందని, ఈ నిర్ణయం ప్రజలను తీవ్ర కష్టాల పాలు చేసే విధంగా ఉందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పటేల్ కరుణాకర్ మండిపడ్డారు. ఆదివారం అయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో ఇంకా చాలామంది ప్రజలకు ఎస్ఐఆర్ ఓటర్ ఎన్యుమరేషన్ దరఖాస్తు ఫారాలు అందలేదని, ఇలాంటి తరుణంలో గడువు ముగిస్తే ఎంతోమంది అర్హుల ఓట్లు గల్లంతు కావడానికి ఆస్కారం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు.ఇంతవరకు తాండూరు పట్టణంలో ఏ వార్డులో ఎంతవరకు ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి అయ్యిందో అధికారులు స్పష్టమైన స్టేట్మెంట్ ద్వారా బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని వార్డుల్లో కనీసం 40 శాతం కూడా మ్యాపింగ్ పనులు జరగలేదని, అలాంటప్పుడు డెడ్లైన్ ఎలా విధిస్తారని అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో చాలామందికి తమ ఓటు హక్కు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ మ్యాపింగ్కు అడుగుతున్న సరైన పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు నిరుపేదల వద్ద లేవని, చదువుకోని వారు టెన్త్ సర్టిఫికెట్లు ఎలా ప్రొడ్యూస్ చేస్తారని, వారి వద్ద పాస్పోర్టులు అసలే ఉండవని ఈ సందర్భంగా గుర్తు చేశారు.తాండూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను, క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి ఓటర్ మ్యాపింగ్ గడువును పొడిగించాలని తాండూరు ప్రజల తరఫున, బిఆర్ఎస్ పార్టీ తరఫున పటేల్ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు.