రఘువరన్ మృతికి కారణం ఆయన కొడుకే – నటుడు బాలాజీ
విలనిజానికి కొత్త అర్థం చెప్పిన నటుడు అంటే “రఘువరన్” గుర్తొస్తారు. విలక్షణ నటనతో, విభిన్నమైన డైలాగ్ డెలివరీతో దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కేవలం విలన్గానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఆయనొక ‘స్టైలిష్ విలన్’ గా పేరొందారు. టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన శివ సినిమాలో రఘువరన్ పోషించిన ‘భవాని’ పాత్ర తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రల్లో ఒకటిగా నిలిచింది.
అలానే భాషా చిత్రంలో రజనీకాంత్కు ధీటైన విలన్ ‘ఆంటోనీ’ పాత్రలో రఘువరన్ నటన అద్భుతం. ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు, లుక్స్ ఇప్పటికీ ఫేమస్ గా ఉంటాయి. సుస్వాగతం చిత్రంలో పవన్ కళ్యాణ్ తండ్రిగా రఘువరన్ నటన ఒక ఎమోషనల్ క్లాసిక్. తండ్రిగా ఆయన పండించిన సెంటిమెంట్ థియేటర్లలో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ఇక ఆజాద్, మాస్ వంటి చిత్రాలలో కూడా మెప్పించారు. అయితే ఈ స్టార్ నటుడి మరణం గురించి ఆయన భార్య సోదరుడు, నటుడు బాలాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. రఘువరన్ మృతికి తన కొడుకే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం అందరికీ షాక్ కలిగిస్తుంది.

బాలాజీ మాట్లాడుతూ..
నా చెల్లెలు రోహిణి, రఘువరన్ ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు రిషి వరన్ ఉన్నాడు. కొడుకు అంటే రఘువరన్ కి అమితమైన ఇష్టం. కానీ రోహిణి – రఘువరన్ మధ్య విభేదాలు కారణంగా ఇద్దరూ విడిపోయారు. అయితే ముఖ్యంగా కలిసి ఉండాలి అనే ఆలోచన అమ్మాయిలో ఉండాలి. అది లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. కానీ కొడుకును తీసుకొని రోహిణి వెళ్ళిపోయింది. కొడుకు అంటే అమితంగా ఇష్టపడే రఘువరన్ రక్తం పంచిన బిడ్డ తన కళ్ళ ఎదుట లేడనే బాధ ఎక్కువైపోయి ఆ బాధతోనే మరణించాడని చెప్పుకొచ్చారు.
కళాకారుడిగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న రఘువరన్, 2008 మార్చి 19న తన 49వ ఏట కన్నుమూశారు. 2008లో వచ్చిన ఆటాడిస్తా లో చివరిగా నటించారు. ఆయన భార్య రోహిణి సైతం చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, టీవీ వ్యాఖ్యాతగా, రచయితగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అటు బాలాజీ సైతం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. అటు సీరియల్స్ లో.. ఇటు సినిమాలలో విలన్ పాత్రలతో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు.






