– ఎమ్మెల్యే, చైర్మన్లపై బురదజల్లితే సహించం
– సాయిపూర్ భూకబ్జాపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం
– అమాయకులను ముందుంచి డ్వాక్రా భవన స్థలం కబ్జాకు కుతంత్రం
– కాంగ్రెస్ 9వ వార్డు నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్
జనవాహిని ప్రతినిధి తాండూరు : స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్లపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుండటం, అసత్య ఆరోపణలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ వారి వ్యాఖ్యలను ఖండించారు. సాయిపూర్లోని ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంలో బీఆర్ఎస్ నేతల తీరును ఆయన తప్పుపట్టారు. ఈ సందర్భంగా ప్రశాంత్ శనివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ….అసలు టిఆర్ఎస్ నాయకులకు సాయిపూర్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని, కనీసం ఆ ప్రాంతంపై అవగాహన లేని నాయకులు ఈ విషయంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 9వ వార్డు కౌన్సిలర్ అనుచరులు చేస్తున్న భూకబ్జాలపై తాము నిర్దిష్టమైన ఆధారాలతో ఆరోపణలు చేశామని స్పష్టం చేశారు. అయితే, దీనిపై సమాధానం చెప్పలేక, కనీస అవగాహన లేని బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేరుగా మాట్లాడటానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. నిజాలు బయటపడతాయనే భయంతోనే వారు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు.సాయిపూర్లోని సర్వే నెంబర్ 13కు సంబంధించిన బొందలగడ్డ భూమిలో ‘డ్వాక్రా భవనం’ ఉందని ప్రశాంత్ తెలిపారు. మొదట అమాయకులను ముందుంచి, ఆ తర్వాత ఆ స్థలాన్ని పూర్తిగా కబ్జా చేయాలనే కుతంత్రం జరుగుతోందని ఆరోపించారు. “అది కబ్జా కాదని నిరూపించే దమ్ము లేక.. తాండూరులో చాలా కబ్జాలు ఉన్నాయి, ఇది కేవలం 50 గజాలే కదా వదిలిపెట్టండి అనే ధోరణిలో సంతుగౌడ్ లాంటి వారితో మాట్లాడించడం హాస్యాస్పదం” అని మండిపడ్డారు.ఇక్కడి ప్రజల సౌకర్యాల కోసం ఉన్న భూములను స్వంత లాభం కోసం కబ్జా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్లపై అనవసరంగా బురదజల్లే కార్యక్రమాలను మానుకోవాలని, లేదంటే ఊరుకునేది లేదని పట్లోళ్ల ప్రశాంత్ స్పష్టం చేశారు.








