Home News 2034 వరకూ కాంగ్రెస్ దే అధికారం: సీఎం రేవంత్ రెడ్డి

2034 వరకూ కాంగ్రెస్ దే అధికారం: సీఎం రేవంత్ రెడ్డి

9
0

పదేళ్ల కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పదేళ్లలో 8 లక్షల 21 వేల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఎవరికైనా డబుల్ బెడ్రూం లు ఇచ్చారా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఇచ్చారా? దళితులకు మూడెకరాలు ఇచ్చారా? కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నలు సంధించారు. అధికారం అనేది ఇక వాళ్లు మరిచిపోవాల్సిందేనని 2034 వరకు కాంగ్రెస్ దే అధికారం అని మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ఏర్పాటు చేసిన ‘కృతజ్ఞత సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. జూలై 2, 2006 నాడు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజని.. ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు మహా వృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచిందని అన్నారు. 20 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

“ఈ జిల్లాకు ఒక గొప్ప నాయకత్వం బాధ్యత నిర్వహించిన అనుభవం ఉంది. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదట ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ఈ జిల్లా బిడ్డనే. ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డిది ఈ గడ్డనే జైపాల్ రెడ్డి రాజకీయ ఎదగడానికి తోడ్పడిన ద్యాప గోపాల్ రెడ్డి ఈ మిడ్జిల్ బిడ్డ. అందుకే రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తో పాటు ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. జూలై 4,2006 నా గెలిచిన గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్ప నిర్ణయం. నా వల్ల ఎవరికీ కష్టం నష్టం రాకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జర్పీటీసీ అభ్యర్థిగా నాపై ఓడిన రబ్బానీకి ఈనాడు ఒక మంచి పదవి ఇవ్వాలని ఉపముఖ్యమంత్రికి సూచన చేస్తున్నా” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

“మిడ్జిల్, గట్టు మండలాలను ఆనాడు డార్క్ మండలాలుగా ప్రకటించారు. అత్యంత వెనకబడిన ప్రజలు చీకట్లో నుంచి వెలుగు రావాలని 2006 లో మీరు నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకున్న ఆ నిర్ణయంతో ఈనాడు ముఖ్యమంత్రిగా ఎదిగే అవకాశం వచ్చింది. అలాంటి మిడ్జిల్ మండలాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత. ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలవాలనేదే మా కోరిక. అందుకే ఈ మండలాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు దత్తత తీసుకోవాలని కోరుతున్నా. మిడ్జిల్ డార్క్ మండలం కాదు.. ఈ ప్రాంతానికి వెలుగు వచ్చిందని, అభివృద్ధి చెందినదిగా మారాలి. అందుకు మీ సహకారం కావాలని భట్టి గారిని కోరుతున్నా. సంక్షేమంతో పాటు అభివృద్ధిని.. అభివృద్ధితో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే దిశగా మేం అడుగులు వేస్తున్నాం” అని సీఎం స్పష్టం చేశారు.

“జనగణనలో కులగణన చేసి వందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. నల్లమల నుంచి వచ్చిన నాకు ఏమీ తెలియదని కొందరు అవహేళన చేశారు. గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తిగా పరిపాలన చేయడానికి కావాల్సిన అవగాహన నాకు ఉంది. గ్రామాల్లో సమస్యలు పరిష్కారమైతే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమయినట్లే పేదల సమస్యలు తెలిసిన నేను పరిష్కారం చూపలేనా? పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా?” అని సీఎం ప్రశ్నించారు.

“అహంకారానికి అహంభావానికి ఒక హద్దు ఉంటుంది. యుద్ధ నౌక, పేదల గళం గద్దర్ అన్నను గడీల ముందు నిలబెట్టిన మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే.. ప్రజా ప్రభుత్వంలో పేదలకు సన్నబియ్యం ఇచ్చిన మాట వాస్తవం కాదా? రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవం కాదా? పదేళ్లలో 8 లక్షల 21 వేల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారు? మీ ఊర్లలో ఎవరికైనా డబుల్ బెడ్రూం లు ఇచ్చారా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఇచ్చారా? దళితులకు మూడెకరాలు ఇచ్చారా? కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా?” అని ప్రశ్నల వర్షం కురిపించారు.

“పాపాల భైరవుడు రావాలి రావాలి అని కొడుకు అల్లుడు తిరుగుతున్నారు. పదేళ్లలో నీళ్లు ఇవ్వలే, నిధులు ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే. ఎందుకు వీళ్లు మళ్లీ రావాలి? ప్రజా పాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డులు ఇచ్చినందుకా? సన్నంబియ్యం ఇచ్చినందుకా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకా? రైతు రుణమాఫీ చేసినందుకా? రైతు భరోసా ఇచ్చినందుకా? చివరి గింజ వరకు కొని రైతుల ఖాతాల్లో 80 వేల కోట్లు వేసినందుకా? గంజాయి, డ్రగ్స్ అమ్మే వాళ్లను జైల్లో పెట్టినందుకా? ఏం అన్యాయం చేశామని ప్రజా ప్రభుత్వం పోవాలి” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

“వాళ్ల సంపాదన, దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయనే మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. పదేళ్లలో ఏం వ్యాపారం చేశారని మీకు వేల కోట్ల సంపాదన వచ్చింది. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గుడు, నీచులు అందుకే మీ పాలన రావాలా? పదేళ్లలో మీకు లక్ష కోట్లు ఎలా వచ్చాయి… తెలంగాణకు 8 లక్షల 21 వేల కోట్ల అప్పులు ఎలా మిగిలాయి? అప్పులు తప్పులు చేసినవాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో ఫోన్ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు. ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవాడు అసలు మనిషేనా? అసెంబ్లీకి రాడు.. ప్రజా సమస్యలు ప్రస్తావించడు… అధికారం ఇస్తే దోచుకోవడానికి మాత్రం వస్తాడట
ఆ పశుపతి ఫామ్ హౌస్ లోనే కుంగి కృశించి పోవాల్సిందే. అధికారం అనేది ఇక వాళ్లు మరిచిపోవాల్సిందే ” అని కీలక వ్యాఖ్యలు చేశారు.

CMRevanth Reddy Declares Congress Will Stay in Power Till 2034 at Midjil Meet Congress till 2034

మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా.. చివరికి నా ప్రాణమిచ్చినా తక్కువే. వలసల పాలమూరును అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. నా ఆత్మ బంధువులు మిడ్జిల్ ప్రజల మధ్య నుంచి చెబుతున్నా.. 2034 వరకు కాంగ్రెస్ దే అధికారం. ప్రజలారా ఆలోచన చేయండి.. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలి. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాల్సిన చారిత్రక అవసరం దేశంలో ఉంది. ఇందుకు తెలంగాణ ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంది. నాతో కలిసి నడవండి.. అండగా నిలవండి.. రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం. అందుకు మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే పడాలి” అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here