కౌన్సిలర్ల ఆరోపణలు అర్థరహితం:..! 

JANAVAHINI
1 Min Read
  • 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప
  • అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కలెక్టర్‌కు ఫిర్యాదు
  • డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పారదర్శకం.. అసత్య ప్రచారాలు నమ్మవద్దు

జనవాహిని ప్రతినిధి, తాండూరు : తాండూరు మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని బిఆర్ఎస్ కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలను 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప తీవ్రంగా ఖండించారు. పట్టణంలో పాలన పారదర్శకంగా సాగుతోందని, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఉనికి కోసమే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ…. బిఆర్ఎస్ కౌన్సిలర్ల ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శల్లో వాస్తవం లేదని ఎల్లప్ప స్పష్టం చేశారు. కేవలం అర్హులైన నిరుపేదలకు ఇళ్లు దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అధికారులు నిబంధనల ప్రకారమే క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారని తెలిపారు. ఇందులో రాజకీయ జోక్యం ఉందనడం హాస్యాస్పదమని, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది అర్హులకు న్యాయం చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.మున్సిపాలిటీలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారిక కార్యక్రమాలకు కౌన్సిలర్లను ఆహ్వానిస్తున్నామని, అయితే అభివృద్ధిని చూసి తట్టుకోలేక కొందరు కావాలనే గైర్హాజరవుతూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రంజాన్ తోఫా పంపిణీలో కూడా ఎలాంటి వివక్ష చూపలేదని, అర్హులైన ప్రతి పేద ముస్లిం సోదరుడికి కానుక అందజేస్తున్నామని తెలిపారు.పట్టణ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి, లేనిపోని కారణాలతో ఆందోళనలు చేస్తామని హెచ్చరించడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఏం చేశామో ఆలోచించుకోవాలని, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాండూరు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి విమర్శలకు తావులేకుండా ముందుకు సాగుతామని దివిటి ఎల్లప్ప స్పష్టం చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *