- తోడబుట్టని బంధానికి ‘రక్షా’ తిలకం
- హాస్టల్ చెల్లెళ్ల ఆత్మీయ రక్షాబంధన్
- రాజ్ కుమార్ కు రాఖి కట్టిన విద్యార్థినిలు
జనవాహిని ప్రతినిధి తాండూరు; కన్నవారి అనురాగానికి, తోడబుట్టిన వారి మమకారానికి దూరంగా హాస్టల్ గోడల నడుమ కాలం గడుపుతున్న విద్యార్థినుల మణికట్టుపై ఆత్మీయత పరిమళించింది. రక్షాబంధన్ మహోత్సవాన్ని పురస్కరించుకుని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ను తమ సొంత అన్నగా గుండెల్లో నిలుపుకున్న విద్యార్థినులు, అత్యంత ప్రేమపూర్వకంగా ఆయనకు ‘రక్షా’ సూత్రాలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ భావోద్వేగ ఘట్టంలో కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ… రక్తసంబంధాన్ని మించిన మనసు బంధం ఇదన్నారు. సొంత ఇంటికి దూరంగా ఉంటున్న ఈ చెల్లెళ్లకు ఏ లోటూ రాకుండా ఒక అన్నగా అండగా నిలవడమే నాకు లభించిన అతిపెద్ద కానుకని పేర్కొన్నారు. నా చేతికి కట్టిన ఈ రాఖీ కేవలం ఒక దారం కాదు… నాపై ఉంచిన నమ్మకమని, నన్ను నిలబెట్టిన బాధ్యత. ప్రతి ఆడబిడ్డకు రక్షణగా, వెన్నుదన్నుగా నిలవడమే నా లక్ష్యం,అని స్పష్టం చేశారు.
అనంతరం విద్యార్థినులకు కానుకలు అందించి, వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. కుటుంబానికి దూరంగా ఉన్నామనే భావనను మరిచిపోయి, విద్యార్థినులు కన్నులవిందుగా జరుపుకున్న ఈ వేడుక తాండూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
