- తాండూరులో విజృంభిస్తున్న బైక్ దొంగలు
- పట్టపగలే వాహనాల మాయం… ఒకే నెలలో ఐదు చోరీలు
- సీసీ కెమెరాలు బంద్, కరువైన గస్తీ…
- కన్నీరు మున్నీరవుతున్న బాధితులు
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణంలో బైక్ దొంగలు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నారు. రాత్రి వేళల్లోనే కాకుండా పట్టపగలే బాహాటంగా వాహనాలను మాయం చేస్తూ ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నారు. గత ఒకే నెల వ్యవధిలో దాదాపు ఐదు బైక్లు చోరీకి గురికావడంతో పట్టణవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. కష్టపడి అప్పులు చేసి, లేదా ఫైనాన్స్లో కొనుగోలు చేసుకున్న ద్విచక్ర వాహనాలు కళ్ల ముందే మాయమవుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి.
పట్టణంలోని ఇందిరా నగర్, శివాజీ చౌక్, రైల్వే స్టేషన్, బస్టాండ్, బసవన్న కట్ట తదితర ప్రాంతాల్లో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇళ్ల ముందు, గేట్ల కాపలాలో పార్క్ చేసిన వాహనాలను సైతం మాయం చేస్తున్నారు.
బాధితులు ఆశతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నా, కేసులు కాగితాలకే పరిమితమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నెలలు గడుస్తున్నా దొంగల ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టణంలోని కీలక జంక్షన్లలో చాలా సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దొంగలకు కలిసివస్తోంది. కెమెరాల ఫుటేజ్లను నిరంతరం పరిశీలించేందుకు తగిన సిబ్బంది లేకపోవడం గమనార్హం.
పోలీసుల రాత్రి గస్తీ నామమాత్రంగా మారడంతో కేటుగాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. క్రైమ్ విభాగంలో తగినంత సిబ్బంది లేకపోవడం విచారణ ఆలష్యానికి కారణమవుతోంది.
ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తాండూరులో రాత్రి వేళల్లో గస్తీ తీవ్రతరం చేయాలని, చెడిపోయిన సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి దొంగల ముఠాను త్వరగా పట్టుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
