HomeNewsఏమి కొనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు..

ఏమి కొనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు..

  • ఏమి కొనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు..
  • ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలు..
  • కిలో 70 రూపాయలు దాటుతున్న చక్కర..
  • ఉల్లీది అదే పరిస్థితి..
  • బ్రేకులు లేకుండా పెరుగుతున్న రేట్లు..
  • చాలా వాటికి బ్రేక్ లేస్తున్న ప్రజలు..
  • ఆదాయం తక్కువ.. వ్యయం ఎక్కువైతే ఎలా అని ప్రశ్నిస్తున్న మధ్యతరగతి ప్రజలు
  • మా బతుకులు మరింత భారంగా మార్చొద్దు అంటూ వేడుకలు..

 

జానవాహిణి హైదరాబాద్ :-  రెక్కాడితే డొక్కాడుతుందో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలను చూస్తే మాత్రం రెక్కా డొక్కా రెండో ఆడకపోవడం ఖాయంగా కనిపిస్తుంది…! తిండి తినాలంటే వస్తువులు కావాలి.. ఆ వస్తువులను కొనుగోలు చేయాలంటే డబ్బు కావాలి.. అంత డబ్బు పెట్టి కొనుగోలు చేసి తినే శక్తి తమకు లేకుండా పోతుందని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.

రోజురోజుకు పలు రకాల నిత్యవసర సరుకులు ధరలు ఆకాశానందుతున్నాయని, ఏం కొనేటట్టు లేదు… ఏం తినేటట్టు లేదని బాధపడుతున్నారు. చాలీచాలని సంపాదనతో పెరుగుతున్న ధరలను ఎలా తట్టుకోవాలని మదన పడుతున్నారు. కొనబోతే కొలిమి అన్న చందంగా తమ పరిస్థితి తయారయిందని పేర్కొంటున్నారు. ప్రతిరోజు అవసరమయ్యే కూరగాయలు మొదలుకొని పప్పు దినుసులు, బియ్యం, పెట్రోల్ ధరల వరకు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలకు బ్రేకులు లేకుండా పెరుగుతుండడంతో అనేక రకాల వస్తువుల కొనుగోలుకు తాము బ్రేకులు వేయాల్సిన పరిస్థితి దాపురించిందని చింతిస్తున్నారు.

ఏమి కొనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు..

మార్కెట్లో ప్రస్తుతం నిత్యవసర సరుకులతో పాటు ప్రతి వస్తువు యొక్క ధరలు పెరిగిపోతుండడంతో అంతంత మాత్రమే సాగుతున్న సంసారాలను ఎలా ఈడ్చుకు రావాలో అర్థం కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడబెట్టడం దేవుడెరుగుని, ఆదాయ వ్యాయాలకు పొంతన లేకుండా పోతుందని అంటున్నారు. ధరలను చూసి చాలా వస్తువులను వదులుకోవాల్సి వస్తుందని, ఏది కొనాలన్నా భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి రేటు మార్కెట్లో పెంచడం వల్ల తమ కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ధరల సమతుల్యత దెబ్బతింటే మధ్యతరగతి ప్రజల నడ్డి విరగడం ఖాయమని భావిస్తున్నారు. మార్కెట్లో ఏ సరుకును కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు.

ఆకుకూరలు మొదలుకొని అన్నిటికి రెక్కలు..

ప్రస్తుతం అన్ని రకాల ఆకుకూరలతో పాటు కూరగాయలకు ధరలకు కూడా రెక్కలు వచ్చేశాయి. అలాగే వంటనూనె ధరలు కాస్లీ అయిపోయాయని, ఏం కొనాలన్నా బడ్జెట్ ని చూస్తే భయమేస్తుందని బాధపడుతున్నారు. ఉల్లిగడ్డ రేటు రోజురోజుకు పెరిగిపోతుందని, త్వరలో దాని రేటు సెంచరీ కావడం ఖాయమని భావిస్తున్నారు. ఆదాయానికి మించిన ధరలు నిత్యవసర సరుకులకు పెరగడంతో తాము పస్తులు ఉండాల్సిన పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉందని అంటున్నారు. మార్కెట్లో దళారుల పెత్తనం పెరగడం వల్ల రైతులకు కూడా పెద్దగా లాభం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలను చూస్తుంటే రోజురోజుకు ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ద్రవ్యల్గుణం ఏర్పడే ఆస్కారం ఉందని పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రజల కొనుగోలు శక్తిని పట్టించుకోండి

రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకులు సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఉందని, ప్రజల యొక్క కొనుగోలు శక్తిని కూడా దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో నిత్యవసర సరుకులు ధరలు ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కోరుతున్నారు. ఇష్టానుసారంగా నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోతుంటే తాము బతికి బట్ట కట్టేది ఎలా అని నిలదీస్తున్నారు. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను నియంత్రించాల్సిన అధికార వ్యవస్థ, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రానున్న మరికొన్ని రోజుల్లో నిత్యవసర సరుకులు ధరలతో పాటు మరిన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ 120 రూపాయలకు చెరువులో ఉందని, అది కూడా పెరిగే ఆస్కారం లేకపోలేదని పేర్కొంటున్నారు. వంటగ్యాస్ ధర ఆల్రెడీ 1000 రూపాయల అయిందని, ప్రతినిత్యం నిత్యవసర సరుకులు లేనిదే సంసారం గడవదని, అలాంటి సరుకుల ధరలు అవకాశాన్నింటితే తాము ఎలా ముందుకు సాగేదని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండే విధంగా చూడాలని, ద్రవ్యోల్బణం ఏర్పడకుండా కట్టడి చేయాలని మెజార్టీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments