- పార్టీలకతీతంగా మానవత్వం
- బాధితుడి పిలుపుతో హాస్పిటల్కు పరుగులు తీసిన బిఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్
జనవాహిని ప్రతినిధి తాండూరు; అధికార కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న ముఠా తగవులు తాండూరు పట్టణంలో తీవ్ర కలకలం రేపాయి. 8వ వార్డులో కమిటీల నియామకంపై మొదలైన విభేదాలు భౌతిక దాడుల వరకు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించేందుకు బిఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ చూపిన చొరవ, మానవత్వం ఇప్పుడు తాండూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
బాధితుడు నాసెర్ తెలిపిన వివరాల ప్రకారం… వార్డు ఇంచార్జి సాయప్ప తన అనుచరులతో కలిసి తనపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చేరారు. సొంత పార్టీ నేతలే దాడులకు తెగబడటం, గాయపడి హాస్పిటల్లో ఉన్నా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్య నాయకులు కానీ పట్టించుకోకపోవడంతో నాసెర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే నాసెర్ తన వార్డు కౌన్సిలర్ అయిన బిఆర్ఎస్ నేత జావీద్కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించారు. విషయం తెలిసిన మరుక్షణమే కౌన్సిలర్ జావీద్ రాజకీయాలకు అతీతంగా స్పందించారు. పార్టీల సరిహద్దులను పక్కనబెట్టి, తన వార్డు వాసికి ఆపద వచ్చిందనే ఆలోచనతో వేగంగా ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆసుపత్రికి వచ్చిన కౌన్సిలర్ జావీద్, నాసెర్ ఆరోగ్య పరిస్థితిపై చికిత్స అందిస్తున్న వైద్యులతో వివరంగా మాట్లాడారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని డాక్టర్లను కోరారు. అనంతరం బాధితుడు నాసెర్ బెడ్ వద్దకు వెళ్లి, ఆయనకు ధైర్యం చెప్పారు. ఏం భయపడాల్సిన పనిలేదు అని భరోసా ఇచ్చారు.
కష్టకాలంలో సొంత పార్టీ నేతలు ముఖం చాటేసిన వేళ, పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి ధైర్యాన్నిచ్చిన బిఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్కు నాసెర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆపదలో ఉన్న వార్డు సభ్యుడి కోసం రాజకీయాలు చూడకుండా స్పందించిన కౌన్సిలర్ జావీద్ సమయస్ఫూర్తిని, మానవత్వాన్ని స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు.
