భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన నటనతో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(94) తుదిశ్వాస విడిచారు. వియోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం మధ్యాహ్నం 1.59 గంటలకు ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ‘నడిగర్ సంగం’ అధ్యక్షుడు నాజర్ అధికారిక ప్రకటన ద్వారా ధ్రువీకరించారు. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్ రోడ్లో ఉంచినట్లు వెల్లడించారు.
ఆకాశవాణి రేడియో జాకీ నుంచి స్టార్ హీరోయిన్గా..
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన సంకరమంచి జానకి చిన్నతనంలోనే వివాహం చేసుకున్నారు. ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి) మద్రాసులో రేడియో జాకీగా పనిచేసిన ఆమె.. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలోనే మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి ఆ తర్వాత డిగ్రీ పట్టా పొందారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రముఖ నటి కృష్ణకుమారి ఈమె చెల్లెలు కాగా, మనవరాలు వైష్ణవి అరవింద్ కూడా నటిగా రాణించారు.
సినీ ప్రస్థానం.. బహుభాషా నటి
1950లో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘షావుకారు’ అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైన జానకి.. మొదటి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని షావుకారు జానకిగా ప్రాచుర్యం పొందారు. అనంతరం 1952లో ‘వలయాపతి’ సినిమాతో తమిళంలో, 1954లో ‘దేవకన్నిక’తో కన్నడలో, 1964లో’స్కూల్ మాస్టర్’ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టారు. 1959లో డాక్టర్ రాజ్ కుమార్ తో కలిసి కన్నడ మొదటి పాన్-ఇండియా సినిమా ‘మహిషాసుర మర్థిని’లో నటించారు.
అవార్డులు
సినిమాల్లోనే కాకుండా 1991లో దూరదర్శన్ ధారావాహిక ‘ఊరరింద రహస్యం’తో బుల్లితెరపైకి అడుగుపెట్టారు. తెలుగులో జీ తెలుగులో ప్రసారమైన ‘వరూధిని పరిణయం’ఆమె నటించిన చివరి సీరియల్. ఇటీవల 2020లో తమిళ సినిమా ‘బిస్కోత్’, 2023లో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో ఆమె చివరిసారిగా వెండితెరపై కనిపించారు. సినీ రంగానికి ఆమె చేసిన విశేష సేవలకుగానూ 2022లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
