ఓటీటీలోకి సూపర్ స్టార్ కృష్ణ మనవడి సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్ గా నటించింది. ఈ రొమాంటిక్ యాక్షన్ అండ్ రస్టిక్ డ్రామా జులై 30న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తో యువతను ఆకట్టుకుంటోంది. అయితే సినిమా రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ఓటీటీ అనౌన్స్ మెంట్ ను వెల్లడించారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ఆగస్టు 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబు కీలకమైన పాత్రలో నటించారు. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ జీ.వీ. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అజయ్ భూపతి సినిమాల్లోని మ్యూజిక్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలు మ్యూజికల్ గానూ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి కూడా మ్యూజిక్ ప్రధానంగా నిలిచింది. ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్ పై పీ కిరణ్ నిర్మించగా, ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ సంస్థ సమర్పించింది.

‘శ్రీనివాస మంగాపురం’ స్టోరీ విషయానికి వస్తే.. ఈ మూవీ తిరుపతి నేపథ్యంలో సాగుతుంది. తిరుపతిలో అడుగుపెట్టిన శ్రీను(జయకృష్ణ) అనే యువకుడు.. అక్కడి పవర్ ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి (శ్యామ్) కుమార్తె మంగ (రషా థడానీ)ను చూసి ప్రేమిస్తాడు. ఆమెకు దగ్గరయ్యే క్రమంలో మంగ జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ నిజం తెరపైకి వస్తుంది. అసలు ఆ రహస్యాన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు..? శ్రీను నేపథ్యం ఏంటి..? బళ్లారికి చెందిన వెంకటప్పయ్య (మోహన్ బాబు), లక్ష్మిపతి (అజయ్)ల మధ్య వివాదం ఈ కథను ఎలాంటి మలుపులు తిప్పింది..? తదితర అంశాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.