Monsoon: ఆగస్టులో అనూహ్యంగా మారిన సీన్- రైతులకు ఊరట- కేంద్రం తాజా రిపోర్ట్..!
భారత్ పై ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో ఎల్ నినో (EL Nino) ప్రభావం తీవ్రంగానే పడింది. ఇప్పటికే ఖరీఫ్ పంటలు వేసేసి రైతులు సేద తీరాల్సిన వేళ.. ఇంకా ఎల్ నినో ముప్పు భయపెడుతూనే ఉంది. దీంతో ఇక ఈ వర్షాకాలంలో వర్షాలు లేవనే అంచనాలకు వచ్చేస్తున్న రైతులకు తాజాగా మారుతున్న పరిణామాలు ఊరట కలిగించేలా ఉన్నాయి. దేశంలో రుతుపవనాలు (Monsoon) మళ్లీ పుంజుకోవడంతో వ్యవసాయ రంగానికి భారీ ఊరట లభిస్తోంది. అయినా త్వరలో ఎల్ నినో ముప్పు పొంచి ఉంది.
ఆగస్టు మొదటి వారంలో కురిసిన అసాధారణ భారీ వర్షాలు దేశవ్యాప్తంగా వర్షపాత లోటును 11 శాతానికి తగ్గించాయని కేంద్రం వెల్లడించింది. దీంతో వెనుకబడిన ఖరీఫ్ సాగు పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో 2011 తర్వాత ఆగస్టు మొదటివారంలో భారీ వర్షం కురిసింది. దేశంలోని పన్నెండుకు పైగా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు సాధారణ సాగుపై నెలకొన్న ఆందోళనలను తొలగించి, రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి.

కేంద్ర వ్యవసాయ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. ఆగస్టు 7 నాటికి దేశంలో ఖరీఫ్ సాగు లోటు 17.96 లక్షల హెక్టార్లకు తగ్గింది. జూలై 24 నాటికి ఈ లోటు దాదాపు 38.82 లక్షల హెక్టార్లుగా ఉంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ వ్యత్యాసం గణనీయంగా తగ్గడం విశేషం. ముఖ్యంగా పప్పుధాన్యాల సాగు వేగంగా మెరుగుపడింది. అయితే వరి, నూనెగింజల సాగు మాత్రం గతేడాదితో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉంది. దేశంలో వరి సాగు గతేడాదితో పోలిస్తే 15.90 లక్షల హెక్టార్లు, నూనెగింజల సాగు 5.19 లక్షల హెక్టార్ల మేర తక్కువగా నమోదైందని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నా, వర్షపాత విస్తరణలో తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారత దేశంలో వర్షపాత లోటు కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే దాదాపు 25.5 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

నీటి లభ్యత ఎక్కువగా అవసరమయ్యే వరి పంట సాగుపై ఈ లోటు తీవ్ర ప్రభావం చూపుతోంది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు మధ్య, పశ్చిమ భారత ప్రాంతాలతో పాటు ఈ లోటు ఉన్న ప్రాంతాలలోనూ తగినంత వర్షం కురిపిస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి వర్షాలు ఊరటనిస్తున్నా, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఎల్ నినో ముప్పు పొంచి ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. బలమైన ఎల్ నినో ప్రభావం వల్ల భారత ఉపఖండంలో కరువు పరిస్థితులతో పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మునుపెన్నడూ లేని విధంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు పంటల ఎదుగుదలను దెబ్బతీస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.


