- చట్టవిరుద్ధ సమ్మెకు సహకరిస్తే కఠిన చర్యలు..!
- యజమానులకు తాండూర్ పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాండూర్ పట్టణ పోలీసులు స్థానిక వ్యాపారస్తులకు మరియు ఫంక్షన్ హాల్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఈ సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమని, దీనికి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు.తాండూర్ పట్టణ పరిధిలోని టెంట్ హౌస్ యజమానులు, ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ మరియు కన్వెన్షన్ హాల్స్ నిర్వాహకులు ఎవరూ కూడా సమ్మె చేస్తున్న వారికి సహకరించకూడదని తాండూర్ పట్టణ సీఐ ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మె శిబిరాల ఏర్పాటుకు టెంట్లు గాని, ఇతర సామాగ్రిని గాని సరఫరా చేసి మద్దతు పలికినట్లయితే, వారిని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రోత్సహించిన వారిగా పరిగణించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ సమ్మెకు ఎవరూ మద్దతు తెలపకూడదని, పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం ఈ మేరకు నిఘాను కూడా ముమ్మరం చేసింది.




