- తాండూరులో నక్సలైట్ల కలకలం
- కూలీల వేషంలో ఉంటూ పోలీసులకు చిక్కిన నలుగురు
- మహారాష్ట్ర, తాండూరు పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ సక్సెస్
- రుక్మాపూర్ రైల్వే స్టేషన్ పరిధిలో అరెస్ట్.. మహారాష్ట్రకు తరలింపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ పోలీసు ఆపరేషన్ నిర్వహించారు. గత కొంతకాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న నలుగురు నక్సలైట్లను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ప్రాథమిక సమాచారం మేరకు.. మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు పురుషులతో పాటు ఒక మహిళా నక్సలైట్పై అక్కడ పలు తీవ్రమైన కేసులు నమోదై ఉన్నాయి. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు వీరు పక్కా స్కెచ్తో తాండూరుకు చేరుకున్నారు. తాండూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని రుక్మాపూర్ రైల్వే స్టేషన్లో కూలీ పనులకు కుదిరారు. గత పది రోజులుగా ఎవరికీ అనుమానం రాకుండా పనులు చేసుకుంటూ ఇక్కడే తలదాచుకుంటున్నారు.నిందితులు ఇక్కడే ఉన్నారన్న పక్కా సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక తాండూరు పోలీసుల సమన్వయంతో ఆదివారం తెల్లవారుజామున రుక్మాపూర్ రైల్వే హెడ్ క్వార్టర్స్లో మెరుపు దాడులు (రైడ్స్) నిర్వహించారు. నిందితులు తేరుకునే లోపే పోలీసులు వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.అదుపులోకి తీసుకున్న నలుగురిని ప్రాథమిక విచారణ అనంతరం తదుపరి చర్యల కోసం మహారాష్ట్రకు తరలించారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? తాండూరు ప్రాంతంలో వీరికి ఎవరైనా ఆశ్రయం కల్పించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రైల్వే పనుల వద్దకు వచ్చే కొత్త వ్యక్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించాలని అధికారులు సూచిస్తున్నారు.




