- ఎమ్మెల్యేపై కేసులు కుట్రలైతే.. భయమెందుకు?
- కాంగ్రెస్ నాయకులకు లీగల్’ భయం పట్టుకుంది
- అభివృద్ధి శూన్యం.. ఆరోపణలు వాస్తవం: కౌన్సిలర్ జావీద్ కౌంటర్
జనవాహిని ప్రతినిధి, తాండూరు: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై నమోదైన కేసులు కేవలం రాజకీయ కుట్రలని కాంగ్రెస్ నాయకులు అనడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ స్పందించారు. శనివారం కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ గోపాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.బాధితులు తమకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని జావీద్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాతే న్యాయస్థానం కేసు నమోదుకు ఆదేశిస్తుందని, దానిని కుట్ర అని పిలవడం అంటే న్యాయవ్యవస్థను కించపరచడమేనని మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు కాంగ్రెస్ నాయకులు అంతగా ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక కేసులు వేస్తున్నారన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తాండూరులో అభివృద్ధి ఎక్కడ జరుగుతోంది? అధికారం అడ్డుపెట్టుకొని దొరికినంత దోచుకుంటున్నారని ఆరోపించారు. తాండూరు అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థే, ఇసుక మాఫియా చేస్తూ అడ్డగోలుగా వ్యవహారిస్తున్న కాంగ్రెస్ పాలనకు నిదర్శనం. అభివృద్ధి శూన్యం కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి పాత అంశాలను తెరపైకి తెస్తున్నారు అని విమర్శించారు.అధికార పార్టీ అండతో విర్రవీగుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని జావీద్ హెచ్చరించారు. అక్రమ కేసులతో తమను భయపెట్టలేరని, ఎమ్మెల్యే అక్రమాలపై, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయస్థానంలోనే వాస్తవాలను నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.




