- కౌంటింగ్ కేంద్రంపై దాడులకు ప్లాన్
- బుయ్యని మనోహర్ రెడ్డిపై బురదజల్లితే ఖబడ్డార్
- సొంత ఊరిలో ప్రజల ఆదరణ కోల్పోయిన శ్రీశైల్ రెడ్డి
- తాండూరు మున్సిపల్ 26వ వార్డ్ కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తమకు పరాభవం తప్పదని ముందే ఊహించిన ప్రత్యర్థి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌంటింగ్ కేంద్రం వద్ద అల్లర్లు సృష్టించి గందరగోళం చేసేందుకు నీచమైన ప్లాన్ చేశారని 26 వి వార్డ్ కౌన్సిలర్ ఎన్. వైశాలి రాజు గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం వారు ఓ ప్రకటనలో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ పై నాయకులపై నిప్పులు చేరిగారు. ప్రజలు తమ పార్టీని నమ్మడం లేదన్న ఫ్రస్ట్రేషన్తో, కౌంటింగ్ స్టేషన్లోకి చొరబడి దాడులు చేయాలని చూసిన నాయకుల ఆగడాలను పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారని వారు తెలిపారు. ఈ క్రమంలో వారి నాయకుడు రోహిత్ రెడ్డి మత్తులో పోలీసులపై ఎగిరెగిరి పడటం అత్యంత హేయమని, చట్టం ఎవరినీ వదలదని, చేసిన ప్రతి తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైలం రెడ్డి ప్రజా సమస్యలపై అంత అవగాహన ఉంటే, బషీరాబాద్ మండలంలోని తన సొంత ఊరిలో కనీసం సర్పంచ్గా ఎందుకు గెలవలేకపోయారని వైశాలి రాజు గౌడ్ ప్రశ్నించారు. సొంత గ్రామంలోనే ప్రజల ఆదరణ లేని వ్యక్తిని తాండూరు ప్రజలు ఎప్పుడో గుర్తించి పక్కన పెట్టారన్నారు. అలాంటి వారు ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ధీశాలి శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి అని ఆయన కొనియాడారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారి బాగోగులు చూసే నిజమైన ప్రజా నాయకుడిపై బురదజల్లితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, బుడబుడకల మాటలతో విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. మరోసారి ఎమ్మెల్యే గురించి గానీ, ప్రభుత్వం గురించి గానీ అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని వైశాలి రాజు గౌడ్ హెచ్చరించారు. పిచ్చి కూతలు కూస్తే ప్రజలే రోడ్లపై తిరగనీయకుండా బుద్ధి చెబుతారని, తస్మా జాగ్రత్త అంటూ బిఆర్ఎస్ పార్టీ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు.




