- మహిళా బిల్లు ముసుగులో బీజేపీ రాజకీయ కుట్ర…!
- డీలిమిటేషన్ పేరుతో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు
- బిల్లులు వేరు చేస్తేనే కాంగ్రెస్ మద్దతు – వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధారసింగ్…
జనవాహిని ప్రతినిధి తాండూరు : భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక దేశవ్యాప్త కుట్ర దాగి ఉందని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారసింగ్ ఆరోపించారు. సోమవారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.ఈ సందర్భంగా ధారసింగ్ మాట్లాడుతూ.. మహిళా బిల్లును డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంతో ముడిపెట్టడం వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. డీలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాలను తమకు అనుకూలంగా మార్చుకుని, మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతోంది. మహిళా సాధికారత అనేది కేవలం ఒక నెపం మాత్రమే, వారి అసలు లక్ష్యం రాజకీయ ఆధిపత్యమే అని ఆయన ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వానికి మహిళల పట్ల నిజమైన గౌరవం ఉంటే.. మహిళా బిల్లును, డీలిమిటేషన్ బిల్లును వేరువేరుగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ రెండు బిల్లులను విడదీసి, మహిళా రిజర్వేషన్ బిల్లును స్వతంత్రంగా ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ బేషరతుగా ఆమోదం తెలుపుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళల పక్షపాతి అని, మహిళా సాధికారత కోసం నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్ ప్రక్రియ ముగిసే వరకు ఆపడం అంటే మహిళలను మరోసారి వంచించడమేనని మండిపడ్డారు. ఎన్నికల వేళ మహిళల ఓట్లను దండుకోవడానికి చేస్తున్న ఈ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.




