posted on Apr 19, 2024 8:58AM
అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన కౌంటర్ బీఆర్ఎస్ నే కాదు.. బీజేపీని ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత అమిత్ షానే ఇరుకున పెట్టి డిఫెన్స్ లో పడేలా చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మద్యం కేసు నుంచి బయట పడేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారనీ, బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలలో బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దింపిందనీ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా రెండు పార్టీల మధ్యా రహస్య ఒప్పందం లేకపోతే కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు భువనగిరి, చేవెళ్లు, జహీరాబాద్, మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గాలలో ఎందుకు ప్రచారం చేయలేదని సూటిగా ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి బీఆర్ఎస్ సహకారం అందిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని నిలదీస్తున్నారు.
రేవంత్ ఆరోపణలు విమర్శలకు ఆశ్చర్యకరంగా అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ గట్టిగా ఖండనలు రాలేదు. రెండు పార్టీలూ కూడా అతి జాగ్రత్తకు పోయి రేవంత్ విమర్శలపై నోరెత్తకుండా ఉండటమే మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా 370 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ తెలంగాణలో అధమ పక్షం పది స్థానాలలో విజయం సాధించాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది.
ఈ సమయంలో రేవంత్ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం విమర్శలు ఆ పార్టీని ఒకింత చిక్కుల్లో పడేసినట్లే కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్, మెదక్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజ కవర్గాలలో బీఆర్ఎస్ బలహీనతలు బీజేపీకే కలిసివస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రేవంత్ విమర్శలపై స్పందించి పరిస్థితిని కంగాళీ చేసుకోవడం కంటే మౌనమే మేలన్న వ్యూహంతో బీజేపీ ఉందని అంటున్నారు.