- బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇర్షాద్ ‘క్రూరత్వం’..
- భార్య అతీయ సంచలన ఆరోపణలు!
- రాజకీయ డ్రామాతో తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు
- నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు”.. కౌన్సిలర్ భార్య కన్నీటి పర్యంతం.
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఒకవైపు రాజకీయాల్లో కీలక పదవిలో ఉంటూ, మరోవైపు ఇంట్లో భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న 7వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇర్షాద్ అసలు రూపం బయటపడింది. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన భార్య అతీయ మీడియా సాక్షిగా కన్నీటి పర్యంతమయ్యారు. తనకు, తన సోదరులకు ఇర్షాద్ నుంచి ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లయిన మూడు నెలల నుంచే ఇర్షాద్ తనను వేధించడం మొదలుపెట్టారని అతీయ పేర్కొన్నారు. ఏ చిన్న కారణం దొరికినా క్రూరంగా కొట్టేవాడని, పశువుకన్నా హీనంగా చూసేవాడని ఆమె వాపోయారు. నన్ను చిత్రహింసలకు గురిచేస్తూ నరకం చూపించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు అని ఆమె ఆరోపించారు.ఇర్షాద్ ఒక హిందూ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, మరో యువతీతో రహస్యంగా రెండో వివాహం కూడా చేసుకున్నాడని అతీయ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ రెండో పెళ్లి విషయం బయటకు తెలిస్తే చంపేస్తానని తనను కత్తితో బెదిరించాడని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రోజు కూడా తనపై దాడి చేసి భయపెట్టాడని, ప్రాణభయంతోనే తన సోదరులకు సమాచారం అందించానని వివరించారు. తప్పు తన దగ్గర పెట్టుకుని ఇర్షాద్ కావాలనే రాజకీయం అంటూ తప్పుదోవ పట్టిస్తున్నాడు. తన అక్రమ సంబంధాలను ప్రశ్నించినందుకే నాపై కక్ష గట్టాడని, గతంలో కూడా నా సోదరులను చంపేస్తానని, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించాడు అని అతీయ తెలిపారు.ప్రస్తుతం ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఒక ప్రజాప్రతినిధి తన భార్యపైనే ఇలాంటి దాడులకు పాల్పడటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు.



