- బషీరాబాద్ మండల అధ్యక్షుడిగా రాజవర్ధన్ రెడ్డి..!
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ.. పార్టీ శ్రేణుల హర్షం
- పార్టీ అధిష్టాననికి కృతజ్ఞతలు తెలిపిన నూతన అధ్యక్షుడు
జనవహీని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ పరిధిలోని బషీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడిగా రాజవర్ధన్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న రాజవర్ధన్ రెడ్డి సేవలను గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి, ఆయన పేరును జిల్లా నాయకత్వానికి ప్రతిపాదించగా, పార్టీ ఆమోదం తెలిపింది.పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటి నుంచి జెండా మోసి, నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న రాజవర్ధన్ రెడ్డికి ఈ పదవి దక్కడం పట్ల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “నిజమైన కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని అనడానికి రాజవర్ధన్ రెడ్డి నియామకమే నిదర్శనం” అని స్థానిక నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. పార్టీని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులకు రాజవర్ధన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ మండలంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందనడానికి తన నియామకమే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.




