Thursday, February 12, 2026
Home NEWS తాండూరు లో 67.54 శాతం ఓటింగ్…!

తాండూరు లో 67.54 శాతం ఓటింగ్…!

0
113
  • తాండూరు పురపోరు ఫినిష్…! 
  • బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భాగ్యరేఖలు
  • ఓటేసిన 52 వేల మంది.. పురవీధుల్లో ఖాకీల పహారా

జనవాహిని ప్రతినిధి తాండూరు : సర్వత్రా ఉత్కంఠ రేపిన తాండూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. పట్టణంలోని 36 వార్డుల పరిధిలో బుధవారం ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు. మొత్తం 77,029 మంది ఓటర్లకు గాను 67.54 శాతం మంది తమ హక్కును వినియోగించుకున్నారు.

యువత కేక.. మహిళల జోరు!

తొలిసారి ఓటు హక్కు పొందిన నవ యువత ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 10 గంటల వరకు 10.39 శాతంతో మందకొడిగా సాగిన ఓటింగ్, మధ్యాహ్నం 3 గంటల కల్లా ఒక్కసారిగా 58.39 శాతానికి పెరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి మొత్తం 52,025 ఓట్లు పోలయ్యాయి.

నాయకుల మధ్య ‘దొంగ ఓట్ల’ యుద్ధం:

పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న వేళ కొన్ని వార్డుల్లో పొలిటికల్ హీట్ పెరిగింది.వార్డు 34, 23: విజయ విద్యాలయ కేంద్రం వద్ద ‘దొంగ ఓట్లు’ వేయిస్తున్నారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వార్డు 36: పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.అదేవిదంగా, రాజీవ్ కాలనీ, నెహ్రూ గంజ్ పరిసరాల్లోనూ వివాదాలు చెలరేగగా.. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు.జిల్లా ఎన్నికల అబ్జర్వర్లతో పాటు అడిషనల్ ఎస్పీ బి.ఆర్. నాయక్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. 117 కేంద్రాల్లోనూ వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయడంతో అధికారులు కంట్రోల్ రూమ్ నుంచి నిఘా పెట్టారు. 10 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి సుమారు 600 మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రక్రియను పూర్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here