- వీరశివాజీ ఆశయాలను యువత పుణికిపుచ్చుకోవాలి…!
- ఇంద్రనగర్లో ఘనంగా జయంతి వేడుకలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఇంద్రనగర్ కాలనీలో మిన్నంటాయి. గురువారం స్థానిక శ్రీ రామ మందిరం సమీపంలో కాలనీ యువజన సంఘం ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాలనీ వీధులన్నీ భగవా ధ్వజాలతో నిండిపోయి ఆధ్యాత్మిక మరియు దేశభక్తి వాతావరణాన్ని తలపించాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ సంపత్ కుమార్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్, భద్రప్ప, అంజిల్ రెడ్డి, దోమ కృష్ణ లు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ….ఛత్రపతి శివాజీ కేవలం ఒక రాజు మాత్రమే కాదు, భారతీయ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. పరాయి పాలనలో మగ్గుతున్న భారతావనిలో ‘స్వరాజ్యం’ అనే నినాదాన్ని వినిపించి, గెరిల్లా యుద్ధ తంత్రంతో శత్రువుల గుండెల్లో నిద్రపోయిన వీరుడు అని కొనియాడారు. నేటి యువత సెల్ఫోన్లకు పరిమితం కాకుండా, శివాజీ మహారాజ్ వంటి మహనీయుల చరిత్రను చదవాలన్నారు. ఆయన చూపిన ధైర్యం, క్రమశిక్షణ, స్త్రీల పట్ల గౌరవం వంటి లక్షణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి” అని పేర్కొన్నారు.



