- కోకట్ వాగు ప్రమాదంపై ఆర్ బి ఓ ఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
- ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం అత్యంత బాధాకరం
- ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలకు పరామర్శ
- యాలాల పోలీస్ రెస్క్యూ టీంకు అభినందనలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : కోకట్ వాగులో జరిగిన ఘోర ప్రమాదంపై ఆర్ బి ఓ ఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయం తెలుసుకున్న ఆయన.. గురువారం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ మృతుల పార్థివదేహాలను సందర్శించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కోకట్ వాగు ప్రమాదంలో పాత తాండూరుకు చెందిన ఆటో డ్రైవర్ మొయిజుద్దీన్ (28), ఆయన బంధువు, కోహిర్ మండలం బసంత్ పూర్ గ్రామానికి చెందిన రహ్మత్ (26)లు మృత్యువాత పడడం తీవ్రంగా కలచివేసిందన్నారు. అంతటితో ఆగకుండా, ఈ ఘోర ప్రమాద వార్త విని తట్టుకోలేక వారి బంధువు సాజిద్ గుండెపోటుతో మరణించడం అత్యంత విచారకరమన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.వాగులో గల్లంతైన రహ్మత్ మృతదేహాన్ని వెలికితీసేందుకు శ్రమించిన యాలాల పోలీస్ రెస్క్యూ టీంను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరగకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.




