- బీసీ మహిళా సబ్ కోటా కోసం జాతీయ స్థాయి ఉద్యమం
- హైదరాబాద్లో కలిసిన తాండూరు నేతలు సయ్యద్ షుకూర్, బస్వరాజ్
- తాండూరులో బీసీ భవన్ సాధనకు కృషి.. ఢిల్లీ పోరుకు సిద్ధం కావాలని పిలుపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : బీసీ మహిళల రాజకీయ ఎదుగుదలకు సబ్ కోటా తప్పనిసరని, దీని సాధన కోసం జాతీయ స్థాయిలో భారీ ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తాండూరుకు చెందిన బీసీ సంఘం నేతలు సయ్యద్ షుకూర్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో బీసీల సమస్యలు, సామాజిక న్యాయం మరియు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లతో పాటు, మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించే వరకు విశ్రమించేది లేదన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వేదికగా నిర్వహించే పోరాటాలకు తాండూరు ప్రాంతం నుండి బీసీలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.తాండూరులో బీసీ భవన్ నిర్మాణ పురోగతిపై కృష్ణయ్య ఆరా తీయగా.. నేతలు స్పందిస్తూ, రాజ్కుమార్ నేతృత్వంలో నియోజకవర్గంలో బీసీ ఉద్యమాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. త్వరలోనే స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి బీసీ భవన్ ఏర్పాటు కోసం వినతి పత్రాలు అందజేస్తామని, స్థల సేకరణ, నిధుల మంజూరు కోసం పోరాడుతామని తెలిపారు. బీసీల ఐక్యతతోనే రాజ్యాంగబద్ధమైన హక్కులు సాధ్యమవుతాయని, కులాలకు అతీతంగా బీసీలందరూ ఏకం కావాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. రాజ్కుమార్ నాయకత్వంలో తాండూరులో బీసీ సంఘాలను బలోపేతం చేస్తూ, సామాజిక న్యాయం కోసం నిరంతరం శ్రమిస్తామని వారు పేర్కొన్నారు.




