- తాండూరు మున్సిపల్ పోరులో బంటు వేణు ప్రభంజనం..!
- 909 ఓట్ల భారీ మెజారిటీతో సరికొత్త చరిత్ర
- వికారాబాద్ జిల్లాలోనే ‘టాప్’ మెజారిటీ రికార్డు
- 11వ వార్డులో కాంగ్రెస్ జెండా రెపరెపలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల చరిత్రలో శుక్రవారం ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బంటు వేణు తన సమీప ప్రత్యర్థులపై ఉప్పెనలా విరుచుకుపడి, కనీవినీ ఎరుగని రీతిలో 909 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయం కేవలం ఒక వార్డు గెలుపు మాత్రమే కాదు, మొత్తం వికారాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా వేణు సరికొత్త రికార్డును నెలకొల్పారు.మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే 11వ వార్డు ఫలితంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, రౌండ్ రౌండ్కు వేణు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోవడంతో ప్రత్యర్థులు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేకపోయింది. తుది ఫలితం వెలువడే సరికి 909 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయకేతనం ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో మరే అభ్యర్థికి ఈ స్థాయి మెజారిటీ దక్కకపోవడం గమనార్హం. దీంతో “జిల్లా టాపర్” గా బంటు వేణు పేరు మారుమోగిపోతోంది.
ప్రజాబలమే నా ఆయుధం..
విజయం అనంతరం బంటు వేణు మాట్లాడుతూ.. ఈ గెలుపు తనది కాదని, 11వ వార్డు ప్రజలదని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు ఈ విజయాన్ని భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నాయి.జిల్లాలోనే టాప్ మెజారిటీ సాధించిన వార్త తెలియగానే తాండూరులో సంబరాలు మిన్నంటాయి. కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ, డప్పు వాయిద్యాల మధ్య బంటు వేణును ఊరేగించారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ భారీ మెజారిటీని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ వార్డు ఎన్నికల్లో ఇంతటి ఆధిక్యం సాధించడం వేణు పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.






