- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ ఖాయం
- ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న విపక్షాలు,సంక్షేమమే మా ఆయుధం
- 9 మున్సిపాలిటీల్లో గెలుపు జెండా ఎగురవేస్తాం: పట్నం మహేందర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించబోతోందని ప్రభుత్వ చీఫ్ వీఫ్ పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఎన్నికల సందర్బంగా ఆయన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. మహేందర్ రెడ్డి తో పాటు ఆయన కుమారుడు రినీష్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరుగుతున్న శంకర్ పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, మేడ్చల్ పరిధిలోని మూడు మున్సిపాలిటీలతో సహా జిల్లాలోని మొత్తం తొమ్మిది స్థానాల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజారంజక పాలనే తమ అభ్యర్థుల గెలుపుకు సోపానాలని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలకు గృహాల మంజూరు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్ల క్రమబద్ధీకరణ వంటి అంశాలు ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచాయని విశ్లేషించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పర్యటనల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు.తాండూరు మున్సిపాలిటీ ఎన్నికలపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఇప్పటికే 12 వార్డుల్లో పర్యటించామని, మహిళలు, యువతలో కాంగ్రెస్ పట్ల విపరీతమైన ఆదరణ కనిపిస్తోందన్నారు. ఇక్కడి 36 వార్డుల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి, సంక్షేమానికి పట్టం కట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.






