Home తెలంగాణ నరేంద్ర మోడీ మంత్రివర్గం సమగ్ర స్వరూపం | modi cabinet overview| modi cabinet| modi...

నరేంద్ర మోడీ మంత్రివర్గం సమగ్ర స్వరూపం | modi cabinet overview| modi cabinet| modi cabinet members

0

posted on Jun 10, 2024 10:04AM

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ఆ తర్వాత మోడీ మంత్రివర్గ సహచరులు 71 మంది చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. 71 మంది మంత్రులలో 30 మంది కేబినెట్ హోదా వున్న మంత్రులు. 5 మంది ఇండిపెండెంట్ ఛార్జ్ వున్న మంత్రులు. 36 మంది సహాయ మంత్రులు. ఏ మంత్రికి ఏ పోర్టుఫోలియో ఇచ్చేదీ తర్వాత ప్రకటిస్తారు. 

కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలు వున్నారు. 10 మంది ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు, ఐదుగురు మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. అలాగే 18 మంది సీనియర్ మంత్రులు ప్రధాన మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు. 

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, 6 సార్లు ఎంపీగా గెలిచిన జుయల్ ఓరం, బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మోదీ కేబినెట్‌లో కొత్తగా చేరారు. ఉత్తరప్రదేశ్ సర్కారులో మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాద్, కర్ణాటక మాజీ మంత్రి సోమన్న సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా వీరితో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సింగ్, భూపేందర్ రాజ్ యాదవ్, షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

ఎన్డీయే మిత్రపక్ష పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎల్‌జేపీ (రామ్‌విలాస్‌ పాశ్వాన్) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌, జేడీ (ఎస్‌) నాయకుడు కుమారస్వామి, హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా అధ్యక్షుడు జితన్‌ రామ్‌ మాంఝీ, జేడీ (యూ) నాయకుడు రాజీవ్‌ రంజన్‌ అకా లలన్‌ సింగ్‌, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదా కలిగిన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా, జితేంద్ర సింగ్, రాందాస్ అథవాలే, నిత్యానందరాయ్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, శ్రీపాద్ నాయక్, రావ్ ఇంద్రజిత్ సింగ్, క్రిషన్ పాల్ గుర్జార్ సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బుల్దానా పార్లమెంట్ సభ్యుడు ప్రతాప్‌రావు జాదవ్‌, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌, ఆర్ఎల్‌డీ చీఫ్ చీఫ్ జయంత్ చౌదరి, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

మోడీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వున్న తనకు ఈ కార్యక్రమానికి హాజరవడం తన బాధ్యత అని ఆయన అన్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆహ్వానాలు అందినప్పటికీ వారి హాజరు కాలేదు. మోడీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏడు దేశాల అధినేతల అతిథులుగా హాజరయ్యారు. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్, ఫిలిప్పీన్ దేశాల నుంచి ఆయా దేశాల నాయకులు వచ్చారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో 8,000 మంది అతిథులు పాల్గొన్నారని అంచనా వేస్తున్నారు. 

Exit mobile version