Home తెలంగాణ Bhupalpally District : వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా

Bhupalpally District : వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా

0

12 టీమ్​లు.. ఏకకాలంలో తనిఖీలు

అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులు ముందు జాగ్రత్తగా జనాల ల్యాండ్​ పేపర్లు, ఏటీఎం కార్డులు, బ్యాంక్​ పాస్​ బుక్స్​, ఇతర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్​ సేకరించి పెట్టుకుంటున్నారు. అధిక వడ్డీ భారంతో డబ్బులు సకాలంలో కట్టలేని పక్షంలో వాటిని జప్తు చేసుకుంటున్నారు. దీంతోనే జనాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో వడ్డీ వ్యాపారుల జాబితా తయారు చేయించారు. అందులో అక్రమంగా దండుకునే వ్యాపారులను లిస్ట్ ఔట్​ చేశారు. ఆ తరువాత భూపాలపల్లి డీఎస్పీ ఏ.సంపత్​ రావు, కాటారం డీఎస్పీ రామ్మోహన్​ రెడ్డి ఆధ్వర్యంలో 12 టీమ్ లు ఏర్పాటు చేశారు. ఆ తరువాత బుధవారం రాత్రి పోలీసులు ఏకకాలంలో రెండు డివిజన్ల పరిధిలోని భూపాలపల్లి, కాటారం, మహదేవ్​ పూర్​ లోని అక్రమ వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వడ్డీ వ్యాపారుల ఇళ్లు, ఆఫీస్​లలో తనిఖీ చేసి 12 మంది అక్రమ దందా చేస్తున్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు 12 మంది వడ్డీ వ్యాపారుల నుంచి 193 ప్రామిసరీ నోట్లు, 93 ఏటీఎం కార్డులు, 28 బ్యాంకు పాసు బుక్కులు, 109 బ్యాంకు చెక్కులు, 13 బాండ్ పేపర్లు, 11 పట్టా పాస్ బుక్కులు, రూ.3,71,240 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వడ్డీ దందా చేస్తున్న 12 మందిపైనా కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, కాటారం డీఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, భూపాలపల్లి, కాటారం, మహదేవ్​ పూర్ సీఐలు నరేష్ కుమార్, నాగార్జున రావు, రాజేశ్వర్ రావు, సీసీఎస్​ సీఐ రవీందర్, భూపాలపల్లి, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.

Exit mobile version