Home తెలంగాణ సికింద్రాబాద్ లోకసభ  బిఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావ్ గౌడ్ 

సికింద్రాబాద్ లోకసభ  బిఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావ్ గౌడ్ 

0

posted on Mar 23, 2024 5:13PM

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొంది.

సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

పద్మారావు గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మోండా మార్కెట్ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కార్పొరేటర్‌గా గెలిచారు. గత రెండు వారాలుగా సికింద్రాబాద్ లోకసభ అభ్యర్థి విషయంలో బిఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ పేర్లు వినిపించినప్పటికీ ఎట్టకేలకు శనివారం పద్మారావ్ గౌడ్ పేరు ఖరారయ్యింది.  బిఆర్ ఎస్ అధినేత కెసీఆర్ తలసానిని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేకపోవడంతో పద్మారావ్ పోటీ చేయడం అనివార్యమైంది. 

Exit mobile version