Home తెలంగాణ వైసీపీ కోసమే పని చేస్తా.. కాపుల కోసం కాదు.. ముద్రగడ | mudragada declars wont...

వైసీపీ కోసమే పని చేస్తా.. కాపుల కోసం కాదు.. ముద్రగడ | mudragada declars wont work for kapus| dalits| bcs support| made

0

posted on Mar 16, 2024 4:59PM

స్వయం ప్రకటిత కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం జగన్ పార్టీ గూటికి చేరారు. శుక్రవారం (మార్చి 15) వైసీపీ కండువా  కప్పుకున్న ముద్రగడ పద్మనాభం శనివారం (మార్చి 16) మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా   కాపు జాతి ఉద్ధరణకు అవతరించిన నాయకుడంటూ జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. అదే సమయంలో రాజకీయ అజ్ణాని అంటూ పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించేశారు. పవన్ కల్యాణ్ ను మార్చుదామనీ తాను ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వాపోయారు కూడా. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం జనసేన గూటికి చేరడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తరువాత  కూడా జగన్ ఆయనను లైట్ గా తీసుకోవడంతో అలిగే.. వైసీపీ తన మనస్తత్వానికి సరిపడదంటూ ప్రకటించి తాను జగన్ పంచన చేరడం లేదని స్పష్టత ఇచ్చిన వారం రోజులకే ముద్రగడ తన స్టాండ్ మార్చుకున్న సంగతి తెలిసిందే. 

పవన్ కల్యాణ్ సినిమాలలోనే హీరో కానీ తాను రాజకీయాలలో హీరోనంటూ తనకు తానే భుజకీర్తులు తగిలించేసుకున్న ముద్రగడ పవన్ కల్యాణ్ తనను జనసేనలోకి ఆహ్వానించినప్పటికీ ఆయన చాలా తక్కువ స్థానాలకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న కారణంగా తాను పార్టీలో చేరడానికి నిరాకరించానని చెప్పుకున్నారు. పొత్తులో భాగంగా కనీసం రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని పవన్ డిమాండ్ చేసి ఉండాల్సిందని కూడా అన్నారు. అయితే ఆయన ద్వంద్వ వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. 

పవన్ కల్యాణ్ ముద్రగడ డిమాండ్ చేసిన విధంగా ఆయనకు రెండు స్థానాలు కేటాయించడానికి నిరాకరించారనీ, ఆ కారణంగానే ముద్రగడ జనసేనలో చేరలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనను తాను కాపు నాయకుడిగా చెప్పుకునే ముద్రగడ ఇప్పడు తన కొత్త బాస్ జగన్ ను మెప్పించేందుకు పవన్ వై విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి కాపు రిజర్వేషన్ల అంశాన్ని పూర్తిగా పూర్వపక్షం చేసిన జగన్ పక్షాన నిలబడి ముద్రగడ ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో కాపు సామాజిక వర్గం అర్ధం చేసుకోవాలని జనసేన వర్గాలు అంటున్నాయి. జగన్ పంచన చేరిన మీరు కాపు రిజర్వేషన్లు అమలు చేయాలన్న షరతేమైనా విధించారా అన్న ప్రశ్నకు ముద్రగడ తను బేషరతుగా వైసీపీలో చేరానని ముక్తాయించారు.

తాను తన కులం కోసం కాదు తన వర్గం కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నానని ముద్రగడ కుండబద్దలు కొట్టేశారు. తన రాజకీయ జీవితంలో కేవలం 5 శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చారనీ, తానీ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు బీసీలు, దళితులే కారణమని చెప్పుకొచ్చారు.   ఇక జగన్ ఆదేశిస్తే  ఎక్కడ నుంచైనా పోటీకి సిద్ధమేనని ముద్రగడ చెప్పినా.. తాజాగా విడుదలైన వైసీపీ అభ్యర్థుల జాబితాలో ముద్రగడ పేరు కనిపించలేదు.

అంటే ముద్రగడ ఇప్పుడు జగన్ కోసం తన ఐడెంటిటీని సైతం వదులుకుని పని చేయడానికి సిద్ధపడిపోయినట్లు స్పష్టంగా అర్ధమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు టికెట్ దక్కలేదని అలిగి బయటకు రాలేని విధంగా వైసీపీలో ఆయన ఇరుక్కుపోయారనీ, ఇంత కాలం ఆయన రాజకీయ ఎదుగుదలకు దోహదపడిన అలక అస్త్రం ఇక ఆయనకు ఉపయోగపడదని చెబుతున్నారు.  

Exit mobile version