అసలేం జరిగింది?
మాచర్ల మండలం నారాయణపురం తండా చెందిన రవి నాయక్, తన అక్క కూతురైన వసంతను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం కలిగారు. రవి నాయక్ హైదరాబాద్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తు్న్నాడు. వారానికో, పది రోజులకో ఇంటికి వస్తూ కుటుంబంతో గడిపే వాడు. అయితే పెళ్లి సమయంలో రవినాయక్కు రెండు ఎకరాల పొలం కట్నంగా వచ్చింది. అప్పులు కారణంగా అందులో ఒక ఎకరం అమ్మేయాలని రవి నాయక్ నిర్ణయించుకున్నాడు. అందుకు భార్య వసంత ఒప్పుకోలేదు. ఈ విషయమై వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో తన పుట్టింటికి వెళ్తానని పట్టుబట్టింది వసంత. అయితే అందుకు భర్త రవి నాయక్ ఒప్పుకోలేదు. దీంతో క్షణికావేశంలో భార్య వసంత…టీలో ఎలుకల మందు కలిపి ముగ్గురు పిల్లలకు ఇచ్చింది ఆ తర్వాత భర్తకు ఇచ్చి తానూ తాగింది. రవి నాయక్ వాసన పసిగట్టి పక్కన పడేశాడు. టీలో ఎలుకల మందు కలిసిందన్న విషయం తెలియని చిన్నారులు అది తాగేశారు. ఆ తర్వాత వారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య వసంత కూడా మృతి చెందింది. భర్త రవి నాయక్ ఎక్కువ తాగకపోవడంతో… అతడికి ప్రస్తుతం ప్రమాదం తప్పినట్లేనని వైద్యులు తెలిపారు. క్షణికావేశంలో భార్య చేసిన పనికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికులు కన్నీళ్లు పెట్టించింది.