- చైర్మన్ అభ్యర్థిగా నర్సింలు
- బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగు.. చైర్మన్ అభ్యర్థిగా పట్లోళ్ల నర్సింలు ఖరారు
- సిట్టింగ్ స్థానం నుండే మళ్ళీ బరిలోకి మాజీ వైస్ చైర్మన్ దీపా నర్సింలు
- తాండూరు రాజకీయాల్లో ‘దంపతుల’ జోరుపై ఆసక్తికర చర్చ
జనవాహిని ప్రతినిధి తాండూరు :తాండూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ బీఆర్ఎస్ అధిష్టానం సాయిపూర్కు చెందిన సీనియర్ నేత పట్లోళ్ల నర్సింలు పేరును ప్రకటించింది. గతంలో కౌన్సిలర్గా, డీపీసీ సభ్యులుగా పనిచేసిన ఆయనకు పట్టణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండటంతో పార్టీ ఆయనకే పట్టం కట్టింది.
నర్సింలు సతీమణి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సింలు తిరిగి ఎన్నికల బరిలో నిలిచారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు నుండి ఘన విజయం సాధించిన ఆమె, వైస్ చైర్మన్గా పట్టణ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ప్రజల్లో ఉన్న ఆదరణ, గతంలో సాధించిన విజయంపై నమ్మకంతో ఆమె మళ్ళీ అదే 9వ వార్డు నుండే పోటీకి సిద్ధమయ్యారు. సిట్టింగ్ స్థానం నుండి ఆమె బరిలో ఉండటం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పట్లోళ్ల దంపతులిద్దరూ ఒకేసారి ఎన్నికల బరిలో నిలవడం ఇప్పుడు తాండూరు అంతటా హాట్ టాపిక్గా మారింది. అటు నర్సింలు చైర్మన్ అభ్యర్థిగా, ఇటు దీపా నర్సింలు సిట్టింగ్ వార్డు నుండి పోటీ చేస్తుండటంతో.. ఈసారి చైర్మన్ పీఠం పట్లోళ్ల కుటుంబానికేనా?” అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఒకే కుటుంబం నుండి ఇద్దరు నాయకులు రంగంలో ఉండటం, పైగా పాత అనుభవాలు, ప్రజాబలం తోడవ్వడంతో ప్రత్యర్థుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. తాండూరు మున్సిపాలిటీలో పట్లోళ్ల నర్సింలు గెలుపు దాదాపు ఖాయమనే ప్రచారం స్థానిక రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
అనుభవం కలిగిన నాయకత్వం, వార్డు స్థాయిలో ఉన్న పట్టు ఈ దంపతులను విజయ తీరాలకు చేరుస్తాయా లేదా అన్నది చూడాలి.






