- తాండూరు మున్సిపల్ పీఠంపై ‘హస్తం’ జెండా
- చైర్మన్ అభ్యర్థిగా నీరజ బాల్రెడ్డి ఖరారు
- చైర్మన్ ఎన్నికను బైకట్ చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్ లు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. భారీ బందోబస్తు, రాజకీయ నాయకుల హడావుడి మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ తన చైర్మన్ అభ్యర్థిగా 12వ వార్డు కౌన్సిలర్ సాయిపూర్ నీరజ బాల్రెడ్డి పేరును అధికారికంగా ఖరారు చేసింది.ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో భారీగా బలగాలను మోహరించారు. మున్సిపల్ కార్యాలయం ముందుకు భారీగా చేరుకున్న వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ వశం కావడంతో చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ ఎన్నికలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు? కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా అంగీకరిస్తారా లేక పోటీకి మొగ్గు చూపుతారా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన కేసులకు నిరసనగా చైర్మన్ ఎన్నికను బీఆర్ఎస్ నాయకులు బైకట్ చేశారు. మరికొద్ది నిమిషాల్లో చైర్మన్ అభ్యర్థిగా నీరజ బాల్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ గెలుపుతో తాండూరు పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ తన పట్టును మరోసారి నిరూపించుకోనుంది.



